హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఓ ముందస్తు ప్రణాళికతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేరొన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ఇన్స్పెక్టర్ బుధవారం హనుమకొండ 4వ మేజిస్ట్రేట్ కోర్టులో రిమాండ్ డైరీ పార్ట్ 1 సమర్పించారు. 2వ, 3వ నిందితులతో సంజ య్ ఒక పథకం ప్రకారం టెన్త్ పేపర్లను సోషల్ మీడియాలో వైరల్ చేయించాలనే కుట్ర పన్నారని తెలిపారు. రిమాండు రిపోర్టులో ఇంకా..
బండి కనుసన్నల్లోనే..
‘ఈ నెల 3న తెలుగు, 4న హిందీ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయనే విధంగా సోషల్ మీడియాలో వచ్చింది. వీటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనే కుట్ర చేశారు. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని 2వ, 3వ నిందితులకు బండి సంజయ్ దిశానిర్దేశం చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించడం ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి కుట్ర చేశారు. ఈ నెల 4న కమలాపూర్ బాలుర పాఠశాలలో ఉదయం 9.45 గంటలకు పేపర్ను సెల్ ఫోన్ ద్వారా ఫొటోలు తీయించారు. దీనిని వైరల్ చేయించారు. ఈ వ్యవహారంపై మాటూరి శివప్రసాద్ మాకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా తీసుకోకూడదు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎగ్జామినర్ కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై తాము లోతుగా దర్యాప్తు ప్రారంభించాం. వివిధ సెక్షన్ల కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.
సాక్షుల సమక్షంలో విచారించాం
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించాం. కమలాపూర్ పాఠశాల భవనం మొదటి అంతస్థు వద్దకు వచ్చి పరీక్ష పేపర్ను సెల్ఫోన్ ద్వారా ఫొటోలు తీశారు. సాక్షుల విచారణ కూడా జరిగింది. ఫొటోలను షేర్ చేసినట్టు 2వ, 3వ నిందితులు అంగీకరించారు. ఆ ఫొటోలను తర్వాత తొలగించారు. పబ్లిక్ పరీక్ష పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగిందనేలా చిత్రించారు. వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఘోరమైన నేరంగా పరిగణించాలి. ఈ చర్య విద్యార్థులు, తల్లిదండ్రులలో భయం సృష్టించేలా ఉంది. 3వ, 5వ నిందితులను సాక్షుల సమక్షంలో విచారించాం. నిందితులంతా నేరం చేసినట్టు అంగీకరించారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు సీసీఎల్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. 3వ, 5వ నిందితుల మొబైల్ ఫోన్ను స్వాధీ నం చేసుకున్నాం. రెండో నిందితుడిని ఆరేపల్లి బస్టాండ్ వద్ద అరెస్టు చేశాం. నేరాన్ని అంగీకరించాడు. బండి సంజయ్ కూడా నేరాన్ని అంగీకరించారు. ఆయన వద్ద సెల్ఫోన్లేదు.
ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయటమే..
ప్రశ్నపత్రాల లీకేజీని నిరోధించడంలో ప్రభుత్వ వైఫల్యమని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్త మనోజ్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాందోళనలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. పరీక్షా కేంద్రంలోని హరీశ్ నుంచి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి ఐదో నిందితుడు గణేశ్కు పంపాడు. వీటిని ఉదయం 10.45 గంటలకు ఇతర నిందితులు కూడా వాట్సాప్ ద్వారా వ్యాప్తి చేశారు. రెండో నిందితుడు ప్రశాంత్ వాట్సాప్లో బండి సంజయ్కి పంపారు. వరంగల్లో ఎస్సెస్సీ హిందీ పేపర్ లీక్’ అనే విధంగా టెక్ట్స్ మెసేజ్లు కూడా సిద్ధం చేశారు. ఏ2గా ఉన్న నిందితుడు గతంలో హెచ్ఎంటీవీ వరంగల్ సిటీబ్యూరో ఇన్చార్జిగా పనిచేశాడు. ప్రస్తుతం బీజేపీకి చెందిన ‘నమో’లో పనిచేస్తున్నాడు. బీజేపీ సోషల్ మీడియాకు జిల్లాలో సలహాదారుగా ఉన్నాడు.
ప్రశాంత్ బండితో అనేకసార్లు మాట్లాడారు
ప్రశాంత్ ఏ1 బండి సంజయ్తో చాలాసార్లు మాట్లాడాడు. ప్రభుత్వ పరువు దిగజార్చాలనే కుట్ర కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ఇతర సాక్షులను విచారించేందుకు సమయం కావాలి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారని తెలియగానే పలువురు నిందితులు తమ ఫోన్లలోని చాటింగ్, పోస్టింగ్స్ను డిలీట్ చేశారు. సాంకేతికత ఆధారంగా వాటిని రిట్రీవ్ చేసేందుకు కొంత సమయం పడుతుంది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం వాస్తవాలను వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మొదటి ముగ్గురు నిందితులు నేరం చేసినట్టుగా రుజువైంది.
నోటీసులు ఇవ్వకుండానే..
నిందితులకు 41ఏ నోటీసు జారీచేయకుండా అరెస్టు చేశారనే వాదన సరికాదు. ఇలాంటి కేసుల్లో నిందితులను అరెస్టు చేయకపోతే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్ర మాదం ఉంది. అరెస్టు చేసిన బండి సంజయ్ ఇతర నిందితులు అందరినీ 14 రోజులపాటు రిమాండ్కు ఉత్తర్వులు ఇవ్వాలి’ అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేరొన్నారు.
ఇన్వెస్ట్గేషన్లో తేలిన నిజాలు..
ఏ1 పన్నిన పథకం ప్రకారం అతని సూచనల మేరకు ఏ2 ఈ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని దురుద్దేశపూర్వకంగా తమకు అనుకూలంగా మలుచుకోదలిచారు. 3వ తేదీన జరిగినట్టుగానే 4వ తేదీన కూడా ప్రశ్న పత్రాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చవచ్చని పథకం పన్నారు. ఇదే విషయాన్ని స్థానిక బీజేపీ కార్యకర్త అయిన మనోజ్తో కూడా చాటింగ్ చేశారు. కమలాపూర్కు చెందిన విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు వెళ్లి సెల్ఫోన్తో ఫొటో తీసి దానిని వివిధ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యూలేట్ చేయడం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తే, ఇది ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించి.. ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేయాలని తలంచారు. అనుకున్నట్టుగానే హిందీ పరీక్ష రోజు ఏ2 పరీక్ష జరుగుతున్న కమలాపూర్ జడ్పీహెచ్ఎస్ తరగతి గదుల నుంచి ప్రశ్న పత్రం ఫొటో కాపీని సంపాదించే బాధ్యతను ఏ3 ద్వారా ఏ5, ఏ8కు అప్పగించారు. వారి పథకం ప్రకారం మైనర్ (సీసీఎల్), ఏ8 కమలాపూర్ జడ్పీహెచ్ఎస్కు వెళ్లారు. కాంపౌండ్వాల్ మీదుగా చెట్టు ఎక్కి ఫస్ట్ఫ్లోర్లోని రూమ్ నంబర్ 3 నుంచి ఓ విద్యార్థి వద్ద ప్రశ్నాపత్రాన్ని 9.45 నిమిషాలకు ఫొటో తీసుకున్నాడు. తర్వాత సదరు మైనర్ దానిని ఏ5 అయిన శివగణేశ్కు పంపాడు. ఆ వెంటనే ఏ5 ఆ ప్రశ్నపత్రాన్ని ‘ఎస్సెస్సీ 2019-20’ అనే వాట్సాప్ గ్రూపులోకి పంపించగా.. ఆ గ్రూపు సభ్యుడైన చందు ఏ3కి ఫార్వర్డ్ చేశాడు. అక్కడ్నుంచి ఏ3 ఆ ప్రశ్న పత్రాన్ని ఏ2కు ఫార్వర్డ్ చేయగా.. తర్వాత ఏ2 ఉదయం 10.46 నిమిషాలకు ఏ1కు ఫార్వర్డ్ చేశాడు. ఆ తర్వాత ఇతరులకు పంపాడు. నేరపూరిత కుట్రలో భాగంగా పరీక్షా కేంద్రం నుంచి సెల్ఫోన్ ద్వారా ప్రశ్న పత్రాన్ని ఫొటో తీసుకొని, సోషల్మీడియా గ్రూపుల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వాన్ని అప్రదిష్ఠపాలు చేయాలని సంకల్పించారు. ఇది పలువురు సాక్షుల ద్వారా బయటపడింది. ఈ కేసులో మరికొంత మంది సాక్షులను విచారించాల్సి ఉంది.