BJP | హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): గ్రూపు రాజకీయాలు, డబ్బు రాజకీయా లు, అలకలు, అంతర్గత వివాదాలతో రాష్ట్రంలో బీజేపీ భ్రష్టుపట్టిందని ఆరెస్సెస్, బీజేపీ వాదు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా పార్టీ ప్రతిష్ఠను సగం గంగలో కలిపితే.. ఈటల రాజేందర్తో అది సంపూర్ణమైందని మండిపడుతున్నారు. ఒంటెత్తు పోకడలు, గ్రూపులు, కోటరీలు, మీడియాకు లీకులు ఇవ్వటం, అధిష్ఠానాన్ని ఎదురించి మాట్లాడటం వంటివి గతంలో ఎన్నడూ లేని ధోరణులు ఇప్పుడు బీజేపీలో మొదలయ్యాయని పేర్కొంటున్నారు.
బండి నోటిదురుసు వల్లే..
క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి మొదటి నుంచీ గుర్తింపు ఉన్నదని నిజమైన బీజేపీ వాదులు గుర్తుచేస్తున్నారు. బండి సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిస్థితి తలకిందులైందని అంటున్నారు. బండి సంజయ్ చిన్నా, పెద్దా అని చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం, మహిళలను కూడా అవమానించటం, తర్వాత నాలుక కరుచుకోవటం, పోలీస్ కేసులు ఎదుర్కోవటం వంటివి పార్టీని ప్రజల్లో చులకన చేశాయని అంటున్నా రు. బండిని ఆసరాగా చేసుకొని చుట్టూ ఉన్న నేతలు కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీ పరువును బజారుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకటి రెండు ఉప ఎన్నికలతో వచ్చిన పేరు కాస్తా బండి సంజయ్ ఒంటెత్తు పోకడలతో పోయిందన్నారు. నేతలను సమన్వయం చేసుకోవాల్సిన అధ్యక్షుడు.. వాపును చూసుకొని కేవలం తన స్వార్థం కోసమే పనిచేయటం, నియంతృత్వ ధోరణి అవలంభించటం, తోటి నేతలను అవమానించటం, కోటరీని ఏర్పాటు చేసుకొని వారికే పదవులు ఇవ్వటం వంటివి దశాబ్దాల బీజేపీ చరిత్రలో ఎన్నడూ ఎరుగమని సీనియర్ బీజేపీవాదులు వాపోతున్నారు. దీంతో పార్టీలో ఎన్నడూ లేనట్టుగా గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయని విశ్లేషిస్తున్నారు. ఈ కొత్త సంస్కృతి పార్టీని క్రమంగా ఊబిలోకి నెట్టిందని అంటున్నారు.
కుక్కలు చింపిన విస్తరిని చేశారు
బండి అనుకూల వర్గం, బండి వ్యతిరేక వర్గం, ఈటలకు మరో వర్గం, వీళ్ల గురించి అస్సలు పట్టించుకోని ధర్మపురి అరవింద్, రఘునందన్రావు వంటి వారు ఇంకో వర్గం.. ఇలా పార్టీ మొత్తం కుక్కలు చింపిన విస్తరి మాదిరిగా తయారైందని బీజేపీవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేతల మధ్య కనీస సమన్వయం లేదని వాపోతున్నారు. ఈటల బృందం ఈ మధ్య ఖమ్మం వెళ్తే ‘నాకు తెలియదు’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించటం దీనికి పరాకాష్ఠగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో కనీసం సగం స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉన్నదని గుర్తు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే అందరూ పార్టీ నుంచి జంప్ అవుతారని.. ఆ నలుగురు నేతలే అభ్యర్థులుగా మిగిలిపోతారని హెచ్చరిస్తున్నారు.
ఈటల రాకతో గ్రూపు రాజకీయాలు
ఈటల రాజేందర్ చేరిక బీజేపీకి అనుకూలంగా మారుతుందనుకుంటే.. పూర్తిగా రివర్స్ అయ్యిందని, పార్టీ పరువును పూర్తిగా మంటగలుపుతున్నారని ఆరెస్సెస్ వాదులు మండి పడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేరిక సైతం శరాఘాతంగా మారిందని అంటున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటమితో పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు. బీజేపీలో ఉన్న క్రమశిక్షణ మొత్తాన్ని ఇద్దరూ కలిసి ఖతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో పార్టీ పెద్దలు చెప్పిన ప్రకారమే నడవటం తప్ప.. పెద్దలపై అలగడం, మీడియాకు లీకులు ఇవ్వటం వంటి సంస్కృతి ఎన్నడూ లేదన్నారు. గతంలో కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఏండ్లకేండ్లు శ్రమించిన వారికే పార్టీలో పదవులు దక్కేవని ఆరెస్సెస్ వాదులు గుర్తు చేస్తున్నారు. కానీ అడ్డగోలు చేరికలతో ఈ నిబంధనకు నీళ్లొదిలారని ఆవేదన చెందారు.
ఈటల వచ్చీ రాగానే పెద్ద పదవి ఆశించటం ద్వారా బీజేపీ సిద్ధాంతాలపై తనకు కనీస అవగాహన లేదని నిరూపించుకున్నారని పేర్కొంటున్నారు. అధ్యక్ష పదవి దక్కకపోవటంతో గ్రూపు రాజకీయాలను పతాక స్థాయికి చేర్చారని అంటున్నారు. అలకల సంస్కృతిని తెరమీదికి తెచ్చారన్నారు. మరో ఇద్దరుముగ్గురిని వెంటేసుకొని.. అసంతృప్తి వర్గం అని పేరుపెట్టుకొని, అందరూ పార్టీని వీడుతారంటూ లీకులు ఇచ్చి కథనాలు ప్రసారం చేయించుకుంటున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీ పెద్దలకే తలనొప్పిగా తయారవటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని అంటున్నారు. ఈ పరిణామాలతో పార్టీని మట్టిలో కలిపే ప్రక్రియ దాదాపు సంపూర్ణమైనట్టేనని అంటున్నారు.