మెదక్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ‘ఉచితాలు వద్దంటే.. రైతులకు రైతుబంధు ఇవ్వొద్దు అన్నట్టా? వృద్ధులకు రూ.2 వేల పింఛన్ వద్దన్నట్టా? కాన్పులు జరిగితే కేసీఆర్ కిట్ వద్దన్నట్టా? ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి వద్దన్నట్టా?’ అని మంత్రి హరీశ్రావు ప్ర ధాని మోదీని ప్రశ్నించారు. సోమవారం మెదక్ రైల్వేస్టేషన్లో రేక్పాయింట్ను, జిల్లా కేంద్రంలో గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మెదక్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు చెల్లించి త్వరితగిన పనులు పూర్తి చేయబట్టే మెదక్కు రైలు వచ్చిందని చెప్పారు. మెదక్లో నిర్మించిన రేక్పాయింట్ మెదక్, సిద్దిపేటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రజలు, రైతుల ఇబ్బందులు తీరుతాయని వెల్లడించారు. ఉప ఎన్నికలు తెస్తామని అంటున్న బీజేపీ నాయకులు ఎందుకోసం తెస్తారని ప్రశ్నించారు. ‘ఈ రాష్ర్టానికి జాతీయ హోదా ఇచ్చారా? ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారా?’ అని నిలదీశారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమంలో ఉప ఎన్నికలను తెచ్చామని, టీఆర్ఎస్ ఎంపీలు, కేంద్రమంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులను గడ్డిపోసల్లా లెక్కించి రాజీనామా చేశారని గుర్తుచేశారు. ‘మరి మీ రాజీనామాలు రాజకీయం, అధికారం కోసం కాదా? దమ్ముంటే రాష్ర్టానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించండి’ అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
సంపద సృష్టించేది రైతులే: నిరంజన్రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని రేక్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. గూడ్స్ రైలు రావటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపార లావాదేవీలు పెరుగుతాయని, లక్షల టన్నుల ఎరువుల కోసం రేక్పాయింట్ ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలు ప్రవేశపెట్టి రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. దేశంలో సంపద సృష్టించేది రైతులేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, యాదవరెడ్డి, ఫారూక్హుస్సేన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.