మంత్రి గంగుల, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్
కొత్తపల్లి, మే 29: ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ, అదానీలకు కట్టబెట్టడం తప్పా, ఈ ఎనిమిదేండ్లలో బీజేపీ దేశానికి చేసిందేమీలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు దేశం గొప్పగా ఎదుగుతుందని అందరూ అనుకున్నారని, కానీ ఇప్పుడు అథోగతి పాలైందన్నారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వీరికి గంగుల, వినోద్కుమార్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూడేండ్లుగా కరీంనగర్ ఎంపీగా కొనసాగుతున్న బండి సంజయ్ మూడు రూపాయలు కూడా తేలేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన టీఆర్ఎస్కే ప్రజలను ఓటడిగే హక్కు ఉన్నదన్నారు.