దేశ రాజ్యాంగం ప్రమాదంలో పడింది
ప్రజల జీవించే హక్కు దెబ్బతింటున్నది
పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్
చిక్కడపల్లి, మే 1: కేంద్రంలోని బీజేపీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని పౌర హక్కుల సంఘం కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘విద్య, ఆరోగ్యం, హక్కుల అమలుకు ఉద్యమిద్దాం’ అంటూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్, పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రాజ్యహింస కొనసాగుతున్నదని విమర్శించారు.
వివిధ ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి జైళ్లలో పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, ప్రజల జీవించే హక్కు పోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. విద్య, వైద్యం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు, హక్కుల ఉద్యమంలో పౌర హక్కుల సంఘం మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నగర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.