ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 2: హైదరాబాద్లో నిర్వహిస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వ్యతిరేకంగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. బీజేపీ హఠావో.. దేశ్ బచావో అంటూ.. నినాదాలు చేశారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గో బ్యాక్ మోదీ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్నాయక్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తన ఎనిమిదేండ్ల పాలనలో దేశాన్ని అమ్మకానికి పెట్టారని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని తెలంగాణ రాష్ర్టానికి నెరవేర్చకుండా సవతి తల్లి ప్రేమ కనపరిచారని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి, మోదీకి తగిన బుద్ధి చెప్పేందుకు దేశ ప్రజలు వేచిచూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రేవంత్నాయక్, సందీప్, రాజేశ్, సతీశ్రెడ్డి, అశోక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.