హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సెస్ ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు సాధారణ ఎన్నికల తరహాలో బీజేపీ అనేక కుయుక్తులు పన్నిందని విమర్శించారు. అయినప్పటికీ మరోసారి తెలంగాణ ప్రజల చేతిలో ఆ పార్టీ తిరస్కరణకు గురైందని సోమవారం ఒక ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు.
సంస్కరణల పేరుతో విద్యుత్తు రంగాన్ని సంపూర్ణంగా ప్రైవేటీకరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలకు ఇది ఒక గుణపాఠమని తెలిపారు. విద్యుత్తు సంస్కరణల పేరిట బీజేపీ చేస్తున్న కుతంత్రాలపై సాధారణ ప్రజలకు సైతం సంపూర్ణ అవగాహన ఉందని సెస్ విజయంతో అర్థమవుతుందన్నారు. బీజేపీని గెలిపిస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్తు రద్దవుతుందని, సబ్సిడీ విద్యుత్తు సౌకర్యం ఉండదని భావించినందునే ప్రజలు ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. సాధారణ ఎన్నికల తరహాలో బీజేపీ విచ్చలవిడిగా ప్రలోభాలకు దిగిందని, అడ్డదారులు తొక్కి భారీ ఎత్తున డబ్బులు పంచిందని చెప్పారు. కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బీజేపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు, తిరస్కారభావానికి సెస్ ఫలితాలే నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి స్థానంలో లేదు
తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు స్పష్టంచేస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీని వరుసగా తిరస్కరిస్తూ వస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కే తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై తెలంగాణ ప్రజలకు ఉన్న చెక్కుచెదరని నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని అన్నారు. ‘రైతన్నలు, నేతన్నలు, దళిత, గిరిజనులు, కులవృత్తుల కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్తు సంక్షేమ కార్యక్రమాలకు జనామోదమే సెస్ ఫలితాల్లో స్పష్టమైంది. విద్యుత్తు రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమం మరియు అభివృద్ధి అనే అంశాలతో కూడిన సంతులిత విధానానికి ప్రజల నుంచి దకిన ఆమోదంగా భావిస్తున్నాం. ఈ విజయంతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై, ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగింది. ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్తు సరఫరా, మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలపై దృష్టి పెడతాం’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
అద్భుత విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు
సిరిసిల్లలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఓటర్లకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఫలితాల అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ.. సీఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలు మరోసారి సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారన్నారు. సెస్ ఎన్నికలు రెండు మున్సిపాలిటీలు, 13 మండలాల పరిధిలో జరిగాయని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు నాయకులకు పార్టీ తరఫున కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
సెస్ను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తాం: బీ వినోద్
సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించడంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టిన ఓటర్ల అభిమతానికి అనుగుణంగా.. బాధ్యతతో సెస్ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని వినోద్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన ఓటర్లకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు వినోద్కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా.. ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థులకు అండగా నిలిచారని అన్నారు. తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి సంపూర్ణ సహకారాన్ని తీసుకుని సెస్ను ఆర్థికంగా బలోపేతం చేసిన విషయాన్ని వినోద్కుమార్ గుర్తుచేశారు. సెస్ను ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామని పేరొన్నారు.