BJP | సిరిసిల్ల, సెప్టెంబర్ 8: అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గంభీరావుపేటకు చెందిన ఆ పార్టీ కీలకనేత కటకం మృత్యుంజయం పార్టీని వీడారు. శుక్రవారం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి లేఖను పంపించారు. తక్షణమే ఆమోదించాలని కోరారు. 2019లో బండి సంజయ్ సమక్షంలో చేరిన తాను పార్టీ అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరువన్నమలై నియోజకవర్గం, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేశానని చెప్పారు.
అయితే బాధ్యతలను అప్పగించిన పార్టీ అధిష్ఠానం.. ఎలాంటి పదవి ఇవ్వలేదని రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తక్షణమే రాజీనామాను ఆమోదించాలని కిషన్రెడ్డిని కోరారు. కాగా, ఆయన రాజీనామాతో సిరిసిల్ల నియోజకవర్గంలో కమలం పార్టీ ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.