ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నడు. ప్రగతి భవన్ను పేల్చేస్త అంటడు. ఇంకో పిచ్చోడు సచివాలయాన్ని పేల్చేస్త అంటడు. ఒకనికి ఒకడు పోటీ పడుతున్నరు. ఒకాయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంకొకాయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా? జై తెలంగాణ అని 2001లో కేసీఆర్ గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకుంటే వీళ్లను ఎవడన్నా దేకునా? టీపీసీసీ, తెలంగాణ బీజేపీ ఉండునా?
– మంత్రి కేటీఆర్
వరంగల్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అస్తిత్వాన్ని కాపాడుకొంటూ అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు సాగుతున్న తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్షగట్టి మాట్లాడుతున్నారని, వేటకుక్కల్లాంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణలో కూల్చుడు, పేల్చుడు పనులకు బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు పోటీపడుతున్నారని విమర్శించారు. ఇలాంటి పిచ్చివాళ్ల చేతుల్లో పార్టీలు ఉంటే రాష్ట్రం మొత్తానికి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. పచ్చగా ఉన్న తెలంగాణను ఈ పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ల పిచ్చిమాటలను నమ్మొద్దని ప్రజలను కోరారు. మంత్రి కేటీఆర్ గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో రూ.276 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ బహిరంగసభలో ప్రసంగించారు. ‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయ్యింది. ఇప్పటి వరకు ఎందరో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఇంకెక్కడైనా ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రం లాంటి అభివృద్ధి ఇంకెక్కడైనా ఉంటే… ఆ రాష్ట్రంలోని గ్రామాల ప్రజలు మన రాష్ట్రంలో కలవాలని ఎందుకు అడుగుతున్నరు? మహారాష్ట్రలోని వందల గ్రామాల సర్పంచులు వచ్చి మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కలిసి తెలంగాణలో కలుస్తామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీళ్లు, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు ఏవీ అక్కడ లేవు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మహబూబ్నగర్ను ఆనుకొని రాయచూరు ఉన్నది. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కర్ణాటక ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే తెలంగాణలో కలపాలని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు’ అని తెలిపారు.
భూపాలపల్లిలో మంత్రి కే తారకరామారావు సభకు హాజరైన పార్టీ శ్రేణులు, అభిమానులు
భూపాలపల్లి మండలం వేశాలపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, జగదీశ్రెడ్డి, ఎంపీ దయాకర్, ఎమ్మెల్సీ సిరికొండ, ఎమ్మెల్యే గండ్ర, జడ్పీ చైర్పర్సన్ జ్యోతి తదితరులు
కాంగ్రెస్ దిక్కుమాలిన పాలన మళ్లీ కావాలా?
గత 75 ఏండ్లలో 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నా.. తెలంగాణకు ఒక్క మంచి పని అయినా చేశాయా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘నిన్న ఒకాయన ఇక్కడికొచ్చి కాంగ్రెస్కు ఒక్క చాన్స్ ఇయ్యాలని అడిగిండు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు. 75 ఏండ్లలో 50 ఏండ్లు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? గుర్తున్నదా అప్పుడు ఎట్టుండెనో? పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటర్లు, అర్ధరాత్రి దొంగలొచ్చినట్టు వచ్చే కరెంటు. ఆ రోజులు మళ్లీ కావాలా? అసొంటి దిక్కుమాలిన పాలన కావాలా? ’ అని ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణలోని 4 కోట్ల మంది కేసీఆర్ కుటుంబమేనని స్పష్టంచేశారు.
‘ఒక పిచ్చోడు ఇక్కడ తిరుగుతున్నడు. ప్రగతి భవన్ను పేల్చేస్త అంటుడు. ఇంకో పిచ్చోడు సచివాలయాన్ని పేల్చేస్త అంటుడు. ఒకనికి ఒకడు పోటీ పడుతున్నరు. ఒకాయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంకొకాయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చునా? జై తెలంగాణ అని 2001లో కేసీఆర్ గులాబీ జెండా పట్టుకొని బయలుదేరకుంటే వీళ్లను ఎవడన్నా దేకునా? టీపీసీసీ, తెలంగాణ బీజేపీ ఉండునా? ఇద్దరు ఎట్లుండె! గంజిల ఈగల్లెక్క ఒకరు కరీంనగర్లో కార్పొరేటర్, ఇంకొకడు రోడ్ల పొంటి తిరుగుతుండె. కేసీఆర్ ఉద్యమం, తెలంగాణ ప్రజల పోరాటం పుణ్యమా అని రాష్ట్ర వస్తే ఇప్పుడు ఒక దుకాణం పెట్టుకొని వాళ్లు మాట్లాడుతుంటే గమ్మతనిపిస్తున్నది’ అని అన్నారు. రాజస్థాన్లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తనలో కలుపుకొన్నదని, తెలంగాణలో కూడా అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని గుర్తుచేశారు. రాజస్థాన్లో కాంగ్రెస్ చేస్తే నీతి, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. నాయకుడంటే ప్రజలకు ఏం కావాలో ఆలోచించి, అవసరమైన వసతులు సమకూర్చాలని సూచించారు.
సింగరేణిని కాపాడుతాం
సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కానివ్వబోమని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ‘సింగరేణి కార్మికులకు గతంలో 14 శాతం బోనస్ వచ్చేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ 35 శాతం ఇస్తున్నారు. దేశంలో కోల్ ఇండియా కూడా ఇంత ఇస్తలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మినట్టే సింగరేణిని కూడా ప్రధాని మోదీ అదానీకి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని కార్మిక సంఘాల నేతలు నన్ను కలిసినప్పుడల్లా ఆందోళన చెందుతున్నారు. అలా జరిగేందుకు అవకాశం ఇవ్వం. అవసరమైతే ఎవరితోనైనా, ఎక్కడిదాకా అయినా వెళ్లి కొట్లాడుతాం. సింగరేణిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వం’ అని తేల్చి చెప్పారు.
భూపాలపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రూ.135 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు కాపీని మంత్రి కేటీఆర్ ఈ సభలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి అందజేశారు. భూపాలపల్లి పట్టణంలోని అభివృద్ధి పనుల కోసం మరో రూ.50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అదనంగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రకటించారు. రూ.300 కోట్ల బ్యాంకు రుణాల మంజూరుకు సంబంధించిన చెక్కును మహిళా సంఘాలకు సభలో అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి, రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు.
రూ.15 లక్షలు ఏమాయె?
తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కక్షగట్టి మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. వేట కుక్కలాంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘2014లో అధికారంలోకి రావడానికి నరేంద్రమోదీ ఏమన్నడు? అందరూ బ్యాంకులకు పోయి జన్ధన్ ఖాతాలు తెరవాలని, ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నడు. ఇప్పటికీ వేయలేదు. ఆ పైసలు ఎక్కడికి పోయినయ్? అన్ని పోయి ఒక్కని ఖాతాలో జమ అయినయి. వాడేమో ప్రపంచ కుబేరుడు అయ్యిండు. మనకు మాత్రం చిప్ప కూడా ఇయ్యలె. తెలంగాణ రాష్ర్టానికి మెడికల్ కాలేజీ, ఐఐఎం, నిమ్జ్ ఏదీ ఇయ్యలె. విభజన చట్టంలో పెట్టిన కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు.
నీతి అయోగ్ చెప్పినా మిషన్ భగీరథకు నిధులు ఇయ్యలె’ అని విమర్శించారు. రాష్ట్ర బీజేపీ నేతలకు మెదడు మోకాళ్లలో ఉన్నదని ఎద్దేవా చేశారు. ‘కరోనా టీకాను నరేంద్రమోదీ కనిపెట్టిండని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంటడు. అదే నిజమైతే మోదీకి నోబెల్ బహుమతి కోసం సిఫారుసు చేయాలని చెప్పిన. ఇంకోకాయన నరేంద్రమోదీ దేవుడున్నా అంటడు. ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు? అదానీకా? ప్రజలకా? లీటర్ రూ.40 ఉన్న పెట్రోలు ధరను రూ.120 చేసినందుకా? రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1,200 చేసినందుకా? ఉద్యమం చేసిన 700 మంది రైతులను చంపినందుకా? దేశంలో 30 ఏండ్లలో ఎప్పుడూ లేనంత ద్రవ్యోల్బణం ఉన్నందుకా?’ అని ప్రశ్నించారు. శవం తేలితే మీది, శివం తేలితే మాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నారని, మసీదులు తవ్వేటందుకా ఆయనను ఎంపీగా ఎన్నుకున్నది? అని నిలదీశారు.
సింగరేణి కార్మికులకు గతంలో 14 శాతం బోనస్ వచ్చేది. ఇప్పుడు సీఎం కేసీఆర్ 35 శాతం ఇస్తున్నారు. దేశంలో కోల్ ఇండియా కూడా ఇంత ఇస్తలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మినట్టే సింగరేణిని కూడా ప్రధాని మోదీ అదానీకి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని కార్మిక సంఘాల నేతలు నన్ను కలిసినప్పుడల్లా ఆందోళన చెందుతున్నారు. అలా జరిగేందుకు అవకాశం ఇవ్వం. అవసరమైతే ఎవరితోనైనా, ఎక్కడిదాకా అయినా వెళ్లి కొట్లాడుతాం. సింగరేణిని ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వం.
– మంత్రి కేటీఆర్
రేవంత్, సంజయ్లను తరిమికొట్టాలి
రేవంత్రెడ్డి, బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ పిచ్చికుక్కలను తరిమికొట్టాలి. 30 ఏండ్ల నుంచి చూస్తున్నా. భూపాలపల్లి చాలా వెనుకబడిపోయి ఉండేది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భూపాలపల్లి జిల్లా కేంద్రం అయ్యింది. మెడికల్ కాలేజీ, వంద పడకల ఆస్పత్రి, ఇలా అన్ని వసతులు కల్పించిన సీఎం కేసీఆర్కు మనమంతా రుణపడి ఉండాలి. గతంలో ఎన్ని అవస్థలు పడ్డారో ఇక్కడి వారందరికీ తెలుసు. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మంచి కరెంటు, ఎదురు పెట్టుబడి ఇచ్చి సాగునీరు అందిస్తున్నారు. రేవంత్రెడ్డి బ్లాక్మెయిలర్. ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ మునగడం ఖాయం. కేసీఆర్, కేటీఆర్తోపాటు మంత్రులపై రేవంత్ ఆరోపణలను తిప్పికొట్టండి. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మరో రూ.25 కోట్లు మంజూరు చేస్తాం.
– ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
కాంగ్రెస్, బీజేపీ ఏం చేశాయి ?
కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు రాష్ట్రం వస్తే ఏం వస్తదని ఎగతాళి చేశారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధే వారికి సమాధానం. కొత్త జిల్లాలతో పాలన ప్రజల ముంగిట్లోకి వచ్చింది. వేల కోట్లరూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పాదయాత్ర పేరుతో కొందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం అభివృద్ధి చేశాయో ప్రజలకు చెప్పాలి. బీజేపీ వల్ల పేదోడికి మేలు జరుగలే. గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి నడ్డి విరిచారు. దేశం అంతా తెలంగాణ వైపు చూస్తుంటే.. కండ్లు లేని బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం సిగ్గుచేటు.
– సత్యవతి రాథోడ్, గిరిజన శాఖ మంత్రి
ఇచ్చిన హామీలు నెరవేర్చిన
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవ వల్ల ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాను. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరిన. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, చిప్పకూడు తిన్న దుర్మార్గుడు నా గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నాడు. లంచం, కమీషన్లు తీసుకోకుండా ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నా. శాయశక్తులా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా. రేవంత్రెడ్డి బతుకంతా బ్లాక్మెయిలే. ఆయన వెంట తిరుగుతున్న వారు కూడా బ్లాక్మెయిలర్లే. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ను కోరారు. భూపాలపల్లిలో ఇంజినీరింగ్, చిట్యాలలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తా.
– గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే
భూపాలపల్లి ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతున్నది. పచ్చని పొలాలు, వాటి నడుమ జల సవ్వడి చేస్తున్న కాలువలు, చూడముచ్చటైన రోడ్లు, పొలం గట్ల మీద పచ్చని చెట్లతో ఆ ప్రాంతం అద్భుత సౌందర్యాన్ని సంతరించుకున్నది. గురువారం భూపాలపల్లి పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. మంత్రి జగదీశ్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆ అందమైన దృశ్యాలను వీక్షించారు.