హైదరాబాద్, సెప్టెంబర్14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఫొటోలు పెట్టుకుంటూ బీజేపీ డ్రామాలు చేస్తున్నదని, నిజంగా అంబేద్కర్పై ప్రేమ ఉంటే పార్లమెంట్కు ఆయన పేరు పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ తీర్మాన సమయంలో బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్రావు సభ నుంచి బయటకు వెళ్లడాన్నిబట్టి ఆ పార్టీకి దళితుల అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతున్నదని విమర్శించారు. పార్లమెంటుకు అంబేదర్ పేరు పెట్టాలనే అంశంలో బీజేపీ వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మంత్రి డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో కొనసాగుతున్న అంబేదర్ విగ్రహ ఏర్పాటు పనులను సహచర మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి కొప్పుల ఈశ్వర్ బుధవారం పరిశీలించారు.
పనుల పురోగతిని ఎమ్మెల్యేలకు వివరించారు. అనంతరం మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరుపెట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించడంపై, శాసనసభ తీర్మానం చేయడంపై మంత్రి కొప్పుల హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ తరహాలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు తీర్మానం చేయాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, విగ్రహాలు పెట్టడమే గాకుండా దళితుల అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు వంటి పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. దేశానికే తలమానికంగా రాష్ట్రంలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్ నాటికి అది అందుబాటులోకి రానున్నదని వెల్లడించారు. బాబాసాహెబ్పై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న గౌరవానికి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారీ విగ్రహ ఏర్పాటే ప్రతీక అని పేర్కొన్నారు.
నిలదీతలు తప్పవు: బాల్క సుమన్
పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టే అంశంపై బీజేపీ అధ్యక్షుడు కేంద్రానికి లేఖ రాయాలని ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. అప్పటివరకు దళిత, ఎస్టీ, మైనార్టీ వర్గాలు బండి సంజయ్ని అడుగడుగునా నిలదీయాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రులు తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు తప్పితే దళితుల ఇంట్లో పచ్చి మంచినీళ్లను కూడా ముట్టుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు అంబేదర్ విగ్రహానికి దండలు వేయడం తప్ప దళిత వర్గాలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సం క్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ విప్లు బాల సుమన్, వినయ్భాస్కర్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు రాజయ్య, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, గోపీనాథ్, హన్మంత్షిండేతో తదితరులు పాల్గొన్నారు.