వరంగల్, జనవరి 10: తెలంగాణ ప్రగతిని ఓర్వలేకనే బీజేపీ దివాళాకోరుతనంతో విమర్శలు చేస్తున్నదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆరోపించారు. గత సాధారణ ఎన్నికల తర్వాత వరుసగా ఓడిపోతూ బలహీనంగా మారుతున్న బీజేపీ.. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుని నీచమైన భాషతో వ్యాఖ్యలు చేస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు పగటి వేషగాళ్ల మాదిరి తెలంగాణకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఏమీ చేయలేని బీజేపీ నేతలు ఇకనైనా ఆలోచించుకుని నిధులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థల మంజూరు కోసం పోరాడాలని హితవు పలికారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్తో కలిసి సోమవారం హనుమకొండలోని తన నివాసంలో కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. మధ్యప్రదేశ్లో అనైతికంగా సీఎం అయిన శివరాజ్సింగ్చౌహాన్ సీఎం కేసీఆర్పై విమ్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్ అదుపు తప్పి మాట్లాడుతున్నాడని అన్నారు. ఎన్నికలు రాగానే కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే నీచులు బీజేపీ నేతలు అని మండిపడ్డారు.
నాడు పొగిడిన నోర్లే..
తెలంగాణ పథకాలు భేష్ అంటూ గతంలో ప్రశంసించిన ప్రధాని, కేంద్ర మంత్రులు.. నేడు వాటినే విమర్శించడం బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని శ్రీహరి అన్నారు. తెలంగాణ పథకాలను ఇతర రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని గతంలో సూచించి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడిందని, త్వరలో జరిగే ఐదు రాష్ర్టాల్లో ఓడిపోవడం ఖాయమని చెప్పారు. బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకొని.. 2023 ఎన్నికల్లో గెలుపు కోసం కుయుక్తులు పన్నుతున్నదని మండిపడ్డారు. సమ్మక్క జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వలేదని గుర్తుచేశారు. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి రూ.332 కోట్లు ఖర్చు చేసిందని, కేంద్రం నయాపైసా ఇవ్వలేదని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి రాష్ట్రంపై ప్రేమ ఉంటే ప్రధాని మోదీ దగ్గరికి వెళ్లి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయించాలని హితవు పలికారు. కేంద్ర పర్యాటక మంత్రిగా రాష్ర్టానికి చెందిన కిషన్రెడ్డి ఉన్నప్పటికీ మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వట్లేదని చెప్పారు. ‘బిడ్డా బండి సంజయ్.. ఇది తెలంగాణ గడ్డ. ఉద్యమాలు, పోరటాల గడ్డ. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ అడ్డ’ అని బండి సంజయ్ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణలోనే సీఎం కేసీఆర్ రైతులను రాజును చేస్తే.. బీజేపీ మాత్రం నల్ల చట్టాలను తెచ్చి అన్నదాతలను అరిగోస పెట్టిందని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ర్టానికి సుస్థిరత ఉంటుందని కడియం శ్రీహరి అన్నారు.