హైదరాబాద్, ఫిబ్రవరి 13 : ఇవాళ బెంగళూరులో, కర్ణాటకలో ఏం జరుగుతున్నదో యువత, బుద్ధిజీవులు ఆలోచించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. శాంతియుత వాతావరణం చెడిపోతే పెట్టుబడులూ, ఉద్యోగాలూ రావని హెచ్చరించారు. బీజేపీ నేతలు భగవంతుని పేరుతో ఆరాచకం చేస్తున్నారని దుయ్యబట్టారు.. హిజాబ్ పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేయడం ధర్మమా? అని నిలదీశారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఆయన చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే…
వాళ్లకేనా దేవుడు?
హిజాబ్ పేరుతో, మతంపేరుతో రాజకీయాలు చేయడం ధర్మమా? ఇదేం పద్దతి? వాళ్లకేనా దేవుడు? దేశంలో లక్షల మందిరాలు ఉన్నాయి. దేశంలో నిత్యం ఎక్కడో ఒక దగ్గర గుళ్లు కడుతూనే ఉంటరు. ధర్మం, భగవంతుని పేరుతో ఇదేం అరాచకీయం? ఈ దేశాన్ని ఎటు తీసుకొని వెళ్లాలనుకుంటున్నరు? ఇదేం ప్రవర్తన? ఎవరైనా ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అని నింద మోపుతారు. ఇదెక్కడి పద్ధతి? బీజేపీ నాయకుల మెదళ్లు ఖరాబు అయిపోయాయి. దేశానికి ఇదో పెద్దసమస్యగా మారింది. విభజన రాజకీయాలు చేస్తున్నారు. ఇవేమైనా మంచివా? వీళ్లను ఎంత త్వరగా సాగనంపితే దేశానికి అంత మంచిది. నేను చెప్పేది వందశాతం నిజం. మనం కోరుకొనేది
కాల్పులు, పోలీసుల కర్ఫ్యూ, లాఠీఛార్జీలు కాదు. కావాల్సింది యువతకు ఉద్యోగాలు. రైతులు పండించిన పంట అమ్ముకోవద్దా? ఇలాంటి వాతావరణం ఉంటే వాళ్లు ఎక్కడికి వెళ్తారు. ఇలాంటి బాధాకరమైన పరిస్థితులకు ఏ బీజేపీ నేతలు సమాధానం చెపుతారు? దీనికి ఎవ్వరు బాధ్యత తీసుకుంటారు?
యువతకు ఏం చెప్పాలనుకొంటున్నారు?
‘ఈ దేశ యువతకు విజ్ఞప్తిచేస్తున్నాను. ఈ దేశం మీది, భవిష్యత్తు మీది. యువ మిత్రుల్లారా, సోదరుల్లారా, బుద్ధిజీవుల్లారా, కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఏం జరుగుతున్నదో ఆలోచించండి. యువతకు మీరు ఏం నేర్పాలనుకొంటున్నరు? దేశంలో ఏం జరుగుతున్నది? యువతను ఎంతగా రెచ్చగొడుతున్నారంటే.. గతంలో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. సాగునీళ్లు లేవు, తాగునీళ్లు లేవు. విద్యుత్తు లేదు. మా ఏడేండ్ల పాలనలో తెలంగాణలో గంగాజమునా తెహజీబ్ సంస్కృతి ఉన్నది. మా దగ్గర మంచి సంస్కృతి పెంపొందించాం. మంచి వాతావరణమున్నది. ఇది చెడిపోతే ఇక్కడికి పెట్టుబడులు వస్తాయా? ఒక్కసారి ఆలోచించండి. అఫ్గనిస్తాన్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వెళ్తారా? అక్కడికి ఎవరు పోతరు? పైసలు ఇచ్చినా అక్కడ పెట్టుబడులు పెట్టరు. ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో, ప్రశాంతత, ప్రేమాభిమానాలుంటయో అక్కడికే వెళ్తారు.
సింగరేణిలో కేంద్రం వాటా కొంటం
సింగరేణిని పరిరక్షించుకునేందుకు కార్మికులు పోరాటం చేస్తున్నరు. సంస్థలో కేంద్ర వాటా 49 శాతం డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా పెడితే మేం కొనుక్కుంటమని చెప్పిన. మీకు ఇష్టంలేకపోతే మీ పైసలు కడతా వెళ్లిపో అని చెప్పినం. వాళ్ల పైసలు వాళ్లకు ఇచ్చేయమన్నం. గతంలోనే నేను ప్రతిపాదన పెట్టిన. ఆ పయత్నాలు చేసి సింగరేణికి కాపాడుకుంటం.