ఖలీల్వాడి నవంబర్ 11: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్లు వరుసగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో బీజేపీ నాయకులు గులాబీ బాటపడుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 28 సీట్లు దక్కించుకున్నది. ఆ పార్టీలో నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండటంతో పాటు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువైపోయాయి.
ప్రజా సమస్యలను మరిచి వర్గవిభేదాలను పెంచి పోషిస్తుండటంతో ఇప్పటికే 10 మంది కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరారు. తాజాగా శుక్రవారం ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో 45వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల హేమలతాశ్రీనివాస్ హైదరాబాద్లో టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్సీ కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధికి పట్టం కట్టేందుకు మరికొంత మంది కార్పొరేటర్లు సైతం టీఆర్ఎస్లో చేరే యోచనలో ఉన్నట్టు సమాచారం.