BJP | (గుండాల కృష్ణ – హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి), ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఆరు దశాబ్దాలపాటు కృష్ణాజలాల్లో తీరని అన్యాయానికి గురైన తెలంగాణకు ఇటు గోదావరి జలాల్లోనూ శాశ్వత విఘాతం కలిగించే కుట్రకు తెరలేచింది. తొమ్మిదిన్నరేండ్లపాటు కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా తేల్చకుండా కాలయాపన చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కుతంత్రం చేస్తున్నది. తెలంగాణ గడ్డ మీద నుంచి ఈ ప్రాంతానికి దక్కాల్సిన గోదావరి జలాలను ఏకంగా తమిళనాడుకు తరలించేందుకు రంగం సిద్ధమైంది.
‘తెలంగాణ ప్రయోజనాలతో మాకెలాంటి సంబంధం లేదు. అవేవీ మాకు పట్టవు’ అనే రీతిలో ఏకపక్షంగా ఈ ప్రాజెక్టును ఆగమేఘాల మీద ముందుకు తీసుకొనిపోతున్నది. నదుల అనుసంధానం ఉద్దేశానికి భిన్నంగా, మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తరలించకుండానే, గోదావరి నుంచి కావేరికి జలాలను తరలించేందుకు ‘గోదావరి-కావేరి’ నదుల అనుసంధాన ప్రాజెక్టుకు డీపీఆర్ను తయారుచేసింది.
అసలు గోదావరిలో మిగులుజలాలు ఉన్నాయో, లేవో తేల్చకుండా, ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయకుండా, ఏకపక్షంగా ప్రాజెక్టును చేపట్టేందుకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్డబ్ల్యూడీఏ)ని ఉసిగొల్పుతున్నది. ‘నెలలో అనుసంధాన ప్రాజెక్టుపై అభిప్రాయాలు చెప్పండి. లేకుంటే అంగీకరించినట్టే (డీమ్డ్టు యాక్సెప్ట్) పరిగణిస్తాం’ అంటూ మెడ మీద కత్తి పెట్టింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్కు కూడా ఈ ప్రతిపాదనలు పంపి, నెలలో అభిప్రాయాలు చెప్పాలని లేఖ రాసింది.
అసలే పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడిప్పుడే రైతాంగం కోలుకుంటున్న సమయంలో కేంద్రంలోని బీజేపీ జలఖడ్గంతో తెలంగాణను కోలుకోని దెబ్బ తీసేందుకు సైతం వెనుకంజ వేయడం లేదు. ఛత్తీస్గఢ్ వాడుకోని నీటిని తరలిస్తున్నామంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్తున్నా, కేవలం తమిళనాడులో రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని గోదావరి ప్రాజెక్టులకు తీరనిలోటు ఏర్పడనున్నది.
గత పదేండ్లలో ఇదే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయహోదా ఇచ్చింది లేదు. నయాపైసా అదనపు నిధులు విడుదల చేసిందీ లేదు. కానీ, తమిళనాట రాజకీయ క్రీడ కోసం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు సిద్ధపడటం బీజేపీకి తెలంగాణ ప్రయోజనాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతున్నది. ముఖ్యంగా దీనితో తెలంగాణకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్కు కూడా అటు గోదావరి, ఇటు కృష్ణాజలాల్లో తీరని అన్యాయం జరగనున్నది. ఈ అనుసంధాన ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రమాద ఘంటికలు మోగనున్నాయి.
ఏమిటీ నదుల అనుసంధానం?
భారతదేశంలోని అనేక జీవ నదుల్లో కొన్నింటిని ఏటా వరదలు ముంచెత్తుతుండగా, మరికొన్నింటిలో లోటు ఇన్ఫ్లోతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మిగులు జలాలు ఉన్న నదుల నుంచి లోటు ఉన్న నదులకు జలాలను తరలించడం ద్వారా దేశవ్యాప్తంగా నదీజలాలను సంపూర్ణంగా వినియోగించుకోవచ్చనేది నదుల అనుసంధానం ముఖ్య ఉద్దేశం.
ప్రధానంగా హిమనీనదాల్లోనే అధిక మిగులు జలాల లభ్యత ఉన్నందున అటు నుంచి దక్షిణాది నదులకు అనుసంధానం ద్వారా ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలనేది లక్ష్యం. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకొని, అనుసంధాన ఆశయాన్ని విచ్ఛిన్నం చేస్తున్నది. వాస్తవానికి, గోదావరి మిగులుజలాలను కావేరికి తరలించాలనేది ప్రధాన ఉద్దేశం కాదు.
అంతకంటే ముందు మహానదిలోని మిగులుజలాలను గోదావరికి తరలించి, ఆపై గోదావరి నుంచి కృష్ణా, అటు పిమ్మట పెన్నా, కావేరికి జలాల తరలింపు జరగాలి. కానీ, తమిళనాట రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహానది-గోదావరి అనుసంధానాన్ని అటకెక్కించి, గోదావరి-కావేరి అనుసంధానానికి కాలు దువ్వుతున్నది. తద్వారా ఇప్పుడిప్పుడే గోదావరిజలాల వినియోగాన్ని పెంచుకుంటూ ఊరట పొందుతున్న తెలంగాణకు భవిష్యత్తులో గోదావరి జలాల లభ్యత కూడా గగనంగా మారే ప్రమాదం ఉన్నది.
గోదావరిలో ‘మిగులు’ తేలిందా?
గోదావరిలో ‘మిగులు’జలాలు ఉన్నాయా? నదుల అనుసంధానాన్ని భుజాన వేసుకున్న ఎన్డబ్ల్యూడీఏ దగ్గర ఈ క్షణం వరకు మిగులుజలాలపై శాస్త్రీయ లెక్కలు లేవు. 1995లో ఎన్డబ్ల్యూడీఏ విడుదల చేసిన ఒక పుస్తకంలో ఎస్సారెస్పీ నుంచి ఇచ్చంపల్లి వరకు మాత్రమే ఒక పార్టుగా తీసుకొని మిగులుజలాలు ఉన్నాయనే నిర్ధారణకు వచ్చింది. గోదావరిలో ప్రాణహిత, ఇంద్రావతి కలిసిన తర్వాత ఇచ్చంపల్లి వద్ద 20,327 ఎంఎంక్యూ (717.88 టీఎంసీల) మిగులుజలాలు ఉన్నాయని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది.
తెలంగాణకు హక్కుగా ఉన్న సుమారు 957 టీఎంసీల గోదావరిజలాల్లో ఆశాజనకమైన వినియోగం కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాతనే జరుగుతున్నది. పైగా గతంలో కంటే ఇప్పుడు గోదావరిలో అందుబాటులో ఉన్న నీళ్లు గణనీయంగా తగ్గాయి. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడంతోపాటు వర్షాభావం ఇందుకు ప్రధాన కారణాలు. ఇవన్నీ పరిగణనలోనికి తీసుకోకుండా ఎన్డబ్ల్యూడీఏ చెప్తున్న పాత లెక్కలన్నీ తప్పుల తడక అనేది అక్షరసత్యం.
దేశంలోని ఆయా నదుల్లో మిగులుజలాలపై ఎన్డబ్ల్యూడీఏ దగ్గర ఎలాంటి కచ్చితమైన వివరాలే లేవు. 2004నాటి లెక్కలనే వల్లిస్తూ రాష్ర్టాలపై ఆజమాయిషీ చెలాయించే ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో గోదావరిలో తమ హక్కుభుక్తమైన జలాల వినియోగం తర్వాత మిగులు ఉంటే తరలించాలని గత తొమ్మిదిన్నరేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం గట్టిగా వాదించింది. కానీ, ఇప్పటికీ ఎన్డబ్ల్యూడీఏ మిగులు జలాలపై స్పష్టత ఇవ్వలేదు.
బలిపీఠంపైకి తెలుగు రాష్ర్టాల రైతాంగం
దేశంలోని అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది. కావేరిలో లోటు ఉన్నందున గోదావరి జలాలను అక్కడికి తరలించి తమిళనాడులో రాజకీయంగా బలపడేందుకు వ్యూహరచన చేస్తున్నది. తెలుగు రాష్ర్టాల నోరు కొట్టి ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను కృష్ణా, పెన్నా మీదుగా కావేరీకి తరలించే భారీ కుట్రకు తెరలేపింది.
నదుల అనుసంధాన ముఖ్యోద్దేశం మేరకు మహానది-గోదావరి అనుసంధానం పూర్తయిన తర్వాతనే గోదావరి-కృష్ణా-పెన్నా-కావేరి ప్రక్రియ చేపట్టాలి. ఇందుకు భిన్నంగా గోదావరి-కావేరి అనుసంధాన ప్రక్రియను అందునా సార్వత్రిక ఎన్నికల సమయంలో వేగంగా ముందుకు తీసుకుపోతున్నది. అయితే మిగులుజలాలు తేల్చకుండా ఛత్తీస్గఢ్ వాడుకోని 147 టీఎంసీల జలాలను కావేరికి తరలిస్తామని నమ్మబలుకుతున్నది. ఇందుకు ఛత్తీస్గఢ్ అంగీకరిస్తుందా? అంటే.. తాము ఒప్పిస్తామని చెప్తున్నది.
ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున కేంద్రంలోని మోదీ సర్కారు ఒప్పిస్తామంటున్నది. ఛత్తీస్గఢ్ ప్రజల భవిష్యత్తు ప్రయోజనాలను పణంగా పెట్టి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరిస్తుందా? అనేది ఒక సందేహమైతే, భవిష్యత్తులో గోదావరిజలాల్లో చుక్కనీటినీ వినియోగించుకోబోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇస్తుందా? ఇచ్చినా భవిష్యత్తులో మరో పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ హామీపై నిలబడుతుందా? అనేవి ప్రశ్నలు. ఆ రాష్ట్రం తూచ్ అంటే తెలుగు రాష్ర్టాల్లోని కోట్లాది రైతాంగం బలిపీఠం ఎక్కినట్టే! మరి దానికి బాధ్యులెవరు? చిన్న చిన్న అంశాలకే ఒడ్డు దాటినాక బోడి మల్లన్న అనే రాజకీయ పార్టీలను నమ్మితే నట్టేట మునిగినట్టే!
ఒడిశాను ఒప్పించకుండా తెలుగు రాష్ర్టాలపై దౌర్జన్యం
మహానది-గోదావరి నదుల అనుసంధాన డిజైన్ ప్రకారం.. మహానదిపై మణిభద్ర డ్యాం నుంచి ధవళేశ్వరం ఎగువన 15 కిలోమీటర్ల వద్ద అనుసంధానించాలి. కానీ, డ్యాం నిర్మాణం వల్ల ఒడిశాలో ఏకంగా 59,400 హెక్టార్లు (1,46,775 ఎకరాలు) ముంపునకు గురవుతున్నందున ఒడిశా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. దీంతో మణిభద్ర డ్యాం కాకుండా బర్మూల్ వద్ద (మణిభద్రకు 14 కిలోమీటర్ల ఎగువన) డ్యాంను నిర్మించి, అక్కడి నుంచి ధవళేశ్వరం ఎగువన 15 కిలోమీటర్ల వద్ద అనుసంధానించాలని డిజైన్ సవరించారు.
దీని తర్వాత జరిగిన సమావేశాల్లో మరింత లోతుగా చర్చ జరిపి, ధవళేశ్వరం వద్ద అనుసంధానించడం వల్ల సముద్రంలోకి ఎక్కువగా గోదావరిజలాలు పోవడం మినహా పెద్దగా వినియోగం ఉండదనే అభిప్రాయానికి వచ్చారు. అలాకాకుండా మహానది నుంచి ధవళేశ్వరానికి బదులుగా ఇచ్చంపల్లికి తరలిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనపై సుదీర్ఘకాలం చర్చ జరిపి, ఈ అనుసంధానంపై రూర్కీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీతో అధ్యయనం చేయించారు.
అనంతరం ఆ నివేదికతో సహా జరిగిన సమావేశంలో మహానది నుంచి 324.28 టీఎంసీలను అనుసంధానం ద్వారా తరలించి, ఎన్రూట్ అవసరాలు తీరిన తర్వాత గోదావరి నదిలోకి సుమారు 142.89 టీఎంసీలను తరలిస్తామని ఎన్డబ్ల్యూడీఏ చెప్పింది. కాగా, మహానదిలో మిగులు జలాలే లేవని ఒడిశా జల వనరుల శాఖ సీఈ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాదించారు.
దీంతో మోదీ సర్కారు ఆ ప్రక్రియను పక్కన పెట్టింది. నిజంగా అనుసంధానంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఒడిశాను ఒప్పించి మహానది-గోదావరి, ఆ తర్వాత గోదావరి-కావేరిని చేపట్టాలి. ఇవేవీ చేయకుండా, మోదీ సర్కారు తెలుగు రాష్ర్టాలపై దౌర్జన్యం చేస్తున్నది. గోదావరి-కావేరి అనుసంధానంపై నెల రోజుల్లో అభిప్రాయాలు చెప్పాలని, లేకపోతే మౌనం అంగీకారంగా బుల్డోజ్ చేస్తూ ముందుకుపోతామని హెచ్చరించడం దుర్మార్గం.
కృష్ణా జలాల పంపిణీలో తీవ్ర విఘాతం
మోదీ సర్కారు తమిళనాట రాజకీయ ప్రయోజనాల కోసం ఆడుతున్న ఈ జలకాలాటతో కృష్ణా జలాల్లో తెలుగు రాష్ర్టాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలగనున్నది. గోదావరి నదీజలాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ)లో తెలుగు రాష్ర్టాలు, ఉమ్మడి మధ్యప్రదేశ్ (ఛత్తీస్గఢ్ సహా), ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. కానీ, గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టులో ఎన్డబ్ల్యూడీఏ మాత్రం కర్ణాటక, మహారాష్ట్రను పరిగణనలోనికి తీసుకోవడం లేదు.
అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్కు, ఆపై పెన్నా అటు పిమ్మట కావేరికి తరలించనున్నారు. ఎన్రూటెడ్ (మార్గమధ్య ప్రాంతాలు) ఏరియాకు సాగు, తాగునీరు కూడా ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇందులో గోదావరి-కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం జరుగుతుంది. గతంలోనే పోలవరం ప్రాజెక్టు అంశంపై గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం జరుగుతున్నందున నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ర్టాలకు కృష్ణాజలాల్లో ఆ మేరకు వాటాను అదనంగా కల్పించాలనే మహారాష్ట్ర, కర్ణాటక వాదనతో బచావత్ ట్రిబ్యునల్ ఏకీభవించింది.
ఆ మేరకు రెండు రాష్ర్టాలకు 35 టీఎంసీలను కేటాయించింది. ఇదేరీతిన గోదావరి-కావేరి అనుసంధానంలోనూ గోదావరిజలాలు కృష్ణా, పెన్నా మీదుగా వెళ్తున్నందున ఆ మేరకు తమకు వాటా ఇవ్వాలని ఆ రెండు రాష్ర్టాలు మళ్లీ కృష్ణా ట్రిబ్యునల్ను ఆశ్రయిస్తాయి. అనుసంధాన ప్రాజెక్టులో తెలుగు రాష్ర్టాలకు దక్కే నీళ్లెన్నోగానీ… కృష్ణాజలాల్లో న్యాయమైన హక్కును ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకకు ధారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా ఇటు గోదావరిజలాలను తమిళనాడు తన్నుకుపోతే, అటు కృష్ణాజలాలను ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం కర్ణాటక, మహారాష్ట్ర ఎత్తుకుపోయి, తెలుగు రాష్ర్టాలు రెంటికి చెడ్డ రేవడిలా మారతాయి. ఈ లెక్కన కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తున్నట్టా? ఉన్న నీళ్లనూ ఎత్తుకెళ్తున్నట్టా?
సాంకేతిక పొంతన కుదురుతుందా?
ఎన్డబ్లూడీఏ అనేది కేంద్ర ప్రభుత్వంలోని జల్శక్తి ఆధీనంలోని సంస్థ. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా అదే. కానీ, నదుల అనుసంధానంలో లోతైన సాంకేతిక పరిశీలన లేకుండానే కేవలం పాలకుల రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేందుకే ఇవి పని చేస్తున్నాయా? అనే అనుమానం కలిగేలా వాటి వైఖరి కనబడుతున్నది.
గోదావరిపై ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ బరాజ్ను వంద మీటర్ల ఎత్తులో (ఎఫ్ఆర్ఎల్) నిర్మించారు. దీని బెడ్ లెవల్ (నదిలోని భూ ఉపరితలం) సుమారు 80 మీటర్లు.
గోదావరిలో ప్రాణహిత, ఆపై ఇంద్రావతి కలిసిన పాయింట్కు దిగువన 12 కిలోమీటర్ల దూరంలో ఇచ్చంపల్లి ఉంటుంది. గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇక్కడ ఎన్డబ్ల్యూడీఏ 87 మీటర్ల ఎత్తులో (ఎఫ్ఆర్ఎల్) డ్యాం నిర్మిస్తామని చెప్తున్నది. దీని బెడ్ లెవల్ సుమారు 72.5 మీటర్లు.
ఇచ్చంపల్లికి దిగువన దేవాదుల ఇన్టేక్ పాయింట్ (71 మీటర్లు) ఉంటుంది. దాని దిగువన సమ్మక్క (తుపాకులగూడెం) బరాజ్ ఉంటుంది. సమ్మక్క బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్లు. బెడ్ లెవల్ సుమారు 63 మీటర్లు.
వీటి ప్రకారం మేడిగడ్డ-సమ్మక్క బరాజ్ మధ్య ఇచ్చంపల్లి వద్ద డ్యాం నిర్మించడం వల్ల దిగువన ఉన్న సమ్మక్క బరాజ్ ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్లుగా ఉన్నందున ఇచ్చంపల్లి డ్యాం డౌన్స్ట్రీం ముంపునకు గురవుతుంది.
అదేరీతిన ఇచ్చంపల్లి డ్యాం ఎఫ్ఆర్ఎల్ 87 మీటర్లుగా ఉంటున్నందున మేడిగడ్డ బరాజ్ డౌన్స్ట్రీం ముంపునకు గురవుతుంది. సాంకేతికంగా ఇది ప్రమాదమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి, నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి ప్రతిపాదన తెరపైకి వచ్చినపుడు గోదావరిపై మేడిగడ్డ, సమ్మక్క బరాజ్ల నిర్మాణం జరగలేదు. కానీ, ఇప్పుడు అవి ఉన్నాయి. కనీసం తాజా క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయకుండా ఎన్డబ్ల్యూడీఏ ఎడాపెడా ప్రతిపాదనలు రూపొందించి తెలుగు రాష్ర్టాలపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
కండ్లముందు సాక్ష్యంగా ఛత్తీస్గఢ్ వైఖరి
గోదావరి-కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి దగ్గర నిర్మించే డ్యాం నిర్మాణానికి ఛత్తీస్గఢ్ను ఒప్పిస్తామంటూ కేంద్రం తరఫున ఎన్డబ్ల్యూడీఏ వకాలత్ పుచ్చుకున్నది. రాజకీయాలు మారే కొద్దీ రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కూడా మారుతున్న ఈ రోజుల్లో ఇది సాధ్యమా? ఇందుకు సమ్మక్క (తుపాకులగూడెం) బరాజ్పై ఛత్తీస్గఢ్ వైఖరే ప్రబల సాక్ష్యం. దేవాదుల ప్రాజెక్టుకు నీటి లభ్యత కోసం కేసీఆర్ ప్రభుత్వం తుపాకులగూడెం దగ్గర సమ్మక్క బరాజ్ నిర్మించింది. దీని ఎఫ్ఆర్ఎల్ 83 మీటర్లు. కేంద్ర జల సంఘం ఈ బరాజ్కు అనుమతి ఇవ్వాలంటే ఛత్తీస్గఢ్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) తీసుకురావాలని సూచించింది.
ఆ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇస్తామని చెప్పగా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై ఏమాత్రం స్పందించడం లేదు. గోదావరిపై 83 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కే అంగీకరించని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం… ఇచ్చంపల్లి దగ్గర డ్యాంకు అనుమతి ఇస్తుందా? గతంలో జరిగిన అధ్యయనం మేరకు ఇచ్చంపల్లి దగ్గర 95 మీటర్ల ఎత్తులో డ్యాం నిర్మిస్తే 59.33 టీఎంసీల నీటి నిల్వతో 12,522 హెక్టార్లు (30,943 ఎకరాలు) ముంపు ఉంటుంది. అంటే 87 మీటర్ల ఎత్తులో ఈ స్థాయిలో కాకున్నా భారీగానే ముంపు ఉంటుందనేది అంచనా. దీనికి ఛత్తీస్గఢ్ అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరిస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమ్మక్క బరాజ్కు ఎన్వోసీ కూడా ఇప్పించాలి కదా. తమిళనాడుపై రాజకీయ ప్రేమ ఒలకబోస్తున్న మోదీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవా? తెలంగాణ బీజేపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు?
బాబ్లీ కుంపటిలా తయారైతే బాధ్యులెవరు?
ఉమ్మడి ఏపీలో నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంలో గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల మహారాష్ట్ర శ్రీరాంసాగర్ ఎఫ్ఆర్ఎల్ పరిధిలోనే బాబ్లీ ప్రాజెక్టును నిర్మించే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏటా జూన్ ఒకటో తేదీన బాబ్లీ గేట్లు తెరుచుకుంటాయి. శ్రీరాంసాగర్కు ఎన్ని నీళ్లు వచ్చాయి? హక్తుభుక్తంగా ఇంకా ఎన్ని నీళ్లు రావాలి? వీటితో సంబంధం లేకుండానే అక్టోబర్ 29న బాబ్లీకి ఉన్న 14 గేట్లు మూసుకుపోతాయి. మరుసటి సంవత్సరం జూన్ ఒకటో తేదీ వరకు చుక్క నీటిని దిగువకు రానీయరు. ఇదేరీతిన ఇచ్చంపల్లి దగ్గర జాతీయ ప్రాజెక్టు అయిన గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును నిర్మిస్తే బేసిన్తో ఎలాంటి సంబంధం లేని తమిళనాడు గోదావరిలో భాగస్వామ్యం అవుతుంది.
తాగునీరు, కరువు అంటూ మెలిక పెట్టి ఆ రాష్ట్రం భవిష్యత్తులో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే, ఇచ్చంపల్లి ప్రాజెక్టు తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్కు కూడా ఒక బాబ్లీ ప్రాజెక్టులా తయారవుతుంది. గోదావరికి భారీ వరద వచ్చినపుడు సంతోషమే కానీ, వరద వచ్చే రోజులు మినహా సాధారణ ఇన్ఫ్లోలు ఉండే సమయంలో దిగువకు చుక్క నీరు వెళ్లకుండా తమిళనాడు న్యాయస్థానాల నుంచి భరోసా పొందితే దిగువన ఉన్న తెలంగాణలోని సీతారామ, దుమ్ముగూడెంతోపాటు ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి? ఇప్పటి పాలకులు ఇంత లోతుగా ఆలోచించకపోతే భావితరాలకు అన్యాయం చేసినట్టవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇచ్చంపల్లి మరో పోతిరెడ్డిపాడులా పిడుగైతే..
చెన్నైకి తాగునీరు అనే మానవతా కోణంలో మొదలైన తెలుగుగంగ ప్రాజెక్టు ఇప్పుడు పోతిరెడ్డిపాడు రూపంలో తెలంగాణ నెత్తిన పిడుగులా తయారైంది. కేవలం 1,500 క్యూసెక్కులు, 15 టీఎంసీల జలాల తరలింపు నుంచి ఇంతింతై… అన్నట్టు ఇప్పుడు 88వేల క్యూసెక్కులు, వందల టీఎంసీల కృష్ణా జలాలను తరలించుకుపోయే స్థాయికి వచ్చింది. ఇదేరీతిన తమిళనాడు నీటి ప్రయోజనాల కోసం బీజేపీ ఆడుతున్న జలక్రీడలో ఇచ్చంపల్లి కూడా భవిష్యత్తులో అలా మారదనే గ్యారెంటీ ఎవరిస్తారు? గోదావరి-కావేరి నదుల అనుసంధానం అనేది జాతీయ ప్రాజెక్టు. దీంతో కేంద్రంలోని ఎన్డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ మొదలు అత్యున్నత న్యాయస్థానాల వరకు ఆ ప్రాజెక్టుకే ప్రాధాన్యం ఉంటుంది. దీంతో తెలంగాణ మాకు గోదావరిజలాల్లో లోటు ఏర్పడుతున్నదని భవిష్యత్తుల్లో ఎంత మొత్తుకున్నా అది అరణ్య రోదనగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది.
ఈ ఏడాది అనుభవిస్తున్నాం కదా!
గోదావరి నదికి ఫ్లాష్ఫ్లడ్స్ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అంటే ఒక్కసారిగా 10-20 లక్షల క్యూసెక్కుల వరకు వస్తుంది. రెండు, మూడు రోజుల్లోనే అది నాలుగైదు లక్షలకు, ఆపై అంతకంటే తక్కువకు పడిపోతుంది. ఏడాదిలో అత్యధిక కాలం జలాలను ఎత్తిపోయడమే తెలంగాణకు శరణ్యం. అందుకే, కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాణహిత జలాలను దాదాపు ఏడాది పొడవునా ఎత్తిపోసుకునేందుకు డిజైన్ చేసింది. నిండు వేసవిలోనూ నీటిని ఎత్తిపోసి కండ్ల ముందు చూపింది.
కానీ, ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును విస్మరించడంతో గోదావరి బేసిన్కు పుష్కలమైన ఇన్ఫ్లోలు ఉండి, ఈ సంవత్సరం 2,822.52 టీఎంసీల గోదావరిజలాలు సముద్రంలో కలిసినా, బేసిన్లోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. బోర్లు ఒట్టిపోయి తాగునీటికీ జనం అల్లాడుతున్నారు. భవిష్యత్తులో జాతీయ ప్రాజెక్టు అయిన ఇచ్చంపల్లి అనుసంధాన ప్రాజెక్టుకు ఇన్ఫ్లోలు కావాలనే రక్షణ కవచాన్ని తమిళనాడు సాధించుకుంటే, తెలంగాణ పరిధిలో ఎగువన ఉన్న ఏ ప్రాజెక్టులోనూ నీటిని ఒడిసిపట్టకుండా దిగువకు వదలాల్సిన విషమ పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఏడాదిలో ఒకటి, రెండు నెలలు మినహా మనం గోదావరిజలాలను ఒడిసిపట్టే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతాం. ఎగువన బాబ్లీ వల్ల శ్రీరాంసాగర్కు సమ్మర్ఫ్లోస్ అనేవి లేవు. భవిష్యత్తులోనూ గోదావరిపై ఉన్న మన ప్రాజెక్టులు సమ్మర్ ఫ్లోస్ను నిలుపుకునే హక్కును సైతం కోల్పోవాల్సి వస్తుంది.
రెండు రాష్ర్టాలకూ తీరని ద్రోహం
గోదావరికి ఏటా వచ్చే ఇన్ఫ్లోల్లో ప్రాణహిత, ఇంద్రావతి నుంచే 40% వరద వస్తుంది. అంటే ఈ రెండు ఉప నదులు ఎంతో కీలకం. తెలంగాణ గోదావరిపై కట్టుకున్న ప్రాజెక్టుల్లో ఎస్సారెస్పీ నుంచి మేడిగడ్డ వరకు ప్రాణహితనే జీవనాధారం. దిగువన ఉన్న సీతారామ, దుమ్ముగూడెంతోపాటు ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కూడా ఇంద్రావతి జలాలూ ప్రధానమే. మోదీ ప్రభుత్వం గోదావరి-కావేరీ నదుల అనుసంధానం ద్వారా ప్రాణహిత, ఇంద్రావతి జలాలను తమిళనాడుకు తన్నుకుపోయేందుకు ప్రతిపాదనలు రూపొందించింది.
ఇది పూర్తయితే భవిష్యత్తులో ఎగువ ప్రాజెక్టులతోపాటు సీతారామ, దుమ్ముగూడెం, పోలవరం ప్రాజెక్టులకూ శాశ్వతంగా ఉరితాడు బిగించినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం లోతు గా అధ్యయనం చేసి దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకొని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. లేకపోతే భావి తరాలకు తీరని అన్యాయం చేసినట్టవుతుందని స్పష్టం చేస్తున్నారు.