BJP | హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ మనిషేనని నిర్దంద్వంగా తేలింది. దీంతో టీఎస్పీఎస్సీ లో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదనే సం దేహం మరింత బలపడుతున్నది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన రాజశేఖర్ బీజేపీ సోషల్ మీడియాలో చురుకైన వారియర్. ‘బీజేపీకి ఓటెయ్యాలి, కిషన్రెడ్డిని గెలిపించాలి’ అని రాజశేఖర్ పెట్టిన పోస్టింగ్ క్లిప్పులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. టీఎస్పీఎస్సీలో రాజశేఖర్ సిస్టమ్ అడ్మిన్గా పనిచేస్తున్నాడు. కం ప్యూటర్ హ్యాక్ చేసి క్వశ్చన్ పేపర్లు తస్కరించాడు.
అసలు.. రాజశేఖర్ ప్రమేయమే లేకపోతే కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశమే లేదు. టీఎస్పీఎస్సీ కేసులో ఇంత కీలకమైన రాజశేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అత్యంత సన్నిహితుడనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు రాజశేఖర్ను అదుపులోకి తీసుకున్న వెంటనే.. రాజశేఖర్ బీజేపీ కండువాలతో బండి, కిషన్రెడ్డితో కలిసి ప్రచారాలు నిర్వహించే ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే మరోవైపు ‘ఒకేసారి ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తుంటే మాకు కార్యకర్తలు దొరకటం లేదు’ అని బండి సంజయ్ బహిరంగంగానే వాపోయిన ఉదంతాలూ ఉన్నాయి. టీఎస్పీఎస్సీలో పేపర్ల లీకేజీ వ్యవహారం వెనుక బీజేపీ కుట్ర దాగి ఉన్నదని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది! తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే రాష్ట్రప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే అక్కసుతోనే బీజేపీ ప్రశ్నపత్రాల లీకేజీకి తెరలేపిందని రాష్ట్రంలోని బుద్ధిజీవులు, మేధావులు, నిరుద్యోగులు అభిప్రాయ పడుతున్నారు.