రాష్ట్రంలో మరో కుట్రకు తెరలేసింది.. నీచ రాజకీయాలకు మంత్రాంగం నడుస్తున్నది.. ఉద్రిక్తతలు సృష్టించేందుకు కమలం, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కేవలం డ్రాఫ్ట్ దశలోనే ఉన్నా.. అన్నదాతల్లో ఆ రెండు పార్టీలు గందరగోళం సృష్టించే పన్నాగం పన్నుతున్నాయి. అభ్యంతరాల స్వీకరణకు సిద్ధమని సర్కారు ముందుకొచ్చినా రాజకీయం చేస్తూ పబ్బం గడుపుతున్నాయి. రైతు ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న బీఆర్ఎస్పై ప్రజల్లో గుర్తింపును చెడగొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ముఠాగా ఏర్పడి కామారెడ్డి జిల్లా కేంద్రంగా నీచ రాజకీయం చేస్తున్నాయి.
నిజామాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ ఆమోదమై అమలు కాకముందే నానా యాగీ చేయడం వెనుక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల భారీ కుట్ర దాగి ఉన్నది. అచ్చంగా బోధన్లో విగ్రహం చుట్టూ ఉద్రిక్తతలను అల్లినట్టే ఇక్కడ కూడా రాజకీయ కుట్రకు పాల్పడుతుండటం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈసారి రైతులను పావుగా మార్చి లేనిపోని భయాలను వాళ్లలో చొప్పించి తమ స్వార్థ రాజకీయ అవసరాలకు వాడుకుంటుండటం స్పష్టమవుతున్నది. రైతు రాజ్యంగా వెలుగొందుతున్న రాష్ట్రంలో రైతు వ్యతిరేక కార్యక్రమాలతో బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తేవాలనే దుర్భుద్ధి ఆ రెండు పార్టీల్లో అడుగడుగునా కనిపిస్తున్నది.
గందరగోళాన్ని సృష్టిస్తున్న ప్రతిపక్షాలు
రైతులకు మేలు చేసి వారి మనసులు గెలవాల్సిన ప్రతిపక్ష పార్టీలు వారినే తప్పుదోవ పట్టించి రోడ్డు ఎక్కిస్తున్నాయి. అవగాహన కల్పించి బాధ్యతను చాటుకోవాల్సిన నాయకులు గందరగోళాన్ని సృష్టించి ఆగం చేస్తున్నారు. ఆమోదమే పొందని మాస్టర్ ప్లాన్పై ఈసమెత్తు అభ్యంతరాలు తెలుపకుండా ధర్నాలు, రాస్తారోకోలతో బద్నాం చేసే కుట్రలకు తెర లేపారు. చట్టబద్ధంగా మాస్టర్ ప్లాన్పై అనుమానాలు, సందేహాలు, సమస్యలను పరిష్కరించుకునేందుకు చక్కని వేదికలు ఉన్నాయి. అందుకు ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉంది. అయినా ప్రజాస్వామ్యబద్ధంగా అందుబాటులో ఉన్న అవకాశాలను వాడుకోకుండా బీజేపీ, కాంగ్రెస్ వలలో పడి రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నది. దేశంలో రైతు ప్రయోజనాలే లక్ష్యంగా ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో కర్షకుడిని ఇబ్బంది పెట్టే బృహత్ పట్టణ ప్రణాళికలు ఉండవని స్పష్టమైన ప్రకటనను స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అవేమీ పట్టకుండా బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు చేస్తుండటం వెనుక దాగి ఉన్న మర్మం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారు.
కమలం, హస్తం గల్లీలో దోస్తీ..
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వ్యతిరేక కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి బయట పడింది. మొన్నటి వరకు ఒకరిపై ఒకరు తిట్ల దండకం ఎత్తుకున్న వారంతా కలిసి బంద్లో పాల్గొనడం ఇప్పుడు అంతుచిక్కడం లేదు. బృహత్ పట్టణ ప్రణాళికలో షబ్బీర్ అలీకి సంబంధించిన భూములు సురక్షితంగా ఉన్నాయంటూ గతంలో బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ నాయకుల అక్రమాలపై విమర్శలు గుప్పించింది. ప్రభుత్వ కాలేజీ భూముల వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉందంటూ ఆ పార్టీ నేతలు విమర్శించారు. రైతు జేఏసీ పేరిట బీజేపీ నేతలిచ్చిన కామారెడ్డి బంద్లో స్వయంగా కాంగ్రెస్ ముఖ్య నాయకుడు షబ్బీర్ అలీ పాల్గొనడం, బంద్కు సంఘీభావం తెలపడం చర్చనీయాంశమైంది. జాతీయ రాజకీయాల్లో ఉప్పు, నిప్పుగా ఉండే కాంగ్రెస్, బీజేపీలు కామారెడ్డి గల్లీలో మాత్రం దోస్తీ కట్టడం వెనుకున్న ఆంతర్యం ఏమిటన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతుల్లో బీఆర్ఎస్కు ఉన్న ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఆ పార్టీలు ఉమ్మడిగా కుట్రలకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఎవరూ ఆందోళన చెందవద్దు..
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ కేవలం డ్రాఫ్ట్ మాత్రమే.. కౌన్సిల్ ఆమోదం పొందనేలేదు. అభ్యంతరాలుంటే రైతులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– జితేశ్ వీ పాటిల్, కలెక్టర్, కామారెడ్డి