సిద్దిపేట అర్బన్, ఆగస్టు 20: పేదలకు ఉచిత పథకాలు వద్దంటున్న కేంద్రంలోని బీజేపీ.. కార్పొరేట్ పెద్దలకు 10 లక్షల కోట్ల రుణమాఫీ ఎందుకు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలు అంటూ ఎద్దేవా చేయడంపై మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. సొంత జాగా ఉన్న వాళ్లకు త్వరలోనే రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చిన పైసలు బేస్మెంట్ నిర్మాణానికి కూడా సరిపోలేదని విమర్శించారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇండ్లు కట్టించి తాళాలను లబ్ధిదారుల చేతిలో పెడుతున్నదని చెప్పారు. ఏ పైరవీ లేకుండా షాదీముబారక్, కల్యాణలక్ష్మి అందిస్తున్నామని వివరించారు.
జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే మరింత న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కోరినా కేంద్రం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని మంత్రి హరీశ్రావు విమర్శించారు.
రైతులకు 24 గంటల ఉచిత కరెంటును కేంద్రం కట్ చేసిందని, బాయికాడ మీటర్లు పెడితే రూ.6,500 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తామని ఆశ చూపిందని మంత్రి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మీటర్లు పెట్టకపోవడంతో రాష్ర్టానికి రావాల్సిన రూ.6,500 కోట్లను కేంద్రం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచితే.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రజల సొమ్మును బడా కార్పొరేట్లకు పంచిందని దుయ్యబట్టారు.