జమ్మికుంట, ఆగస్టు 10: ‘బీజేపీకి దళితులంటే పడదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళితులను ఊచకోత కోసే పార్టీ బీజేపీ. అలాంటి పార్టీలో నువ్వెట్ల చేరుతవు ఈటల’ అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ‘నీకు దళితుల ఓట్లొద్దు.. మైనార్టీలవి వద్దు.. మరెందుకు వస్తున్నావో చెప్పాలె. నీకెందుకు ఓటెయ్యాలో చెప్పాలె?, దళితబంధుపై విమర్శ లు చేస్తవా?, మా ప్రభుత్వం 10 లక్షలిస్తున్నది. దమ్ముంటే మీరు మరో 20 లక్షలు ఇయ్యండి. దళితులను ఆదుకోండి. ఇది చేతకాదు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడుతారా?’ అని మండిపడ్డారు. మంగళవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట, కేశవపురం, ధర్మారం వార్డుల్లోని దళిత కాలనీల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనారోగ్యానికి గురైన బాధితులను పరామర్శించారు. తర్వాత ఆయా వార్డుల్లో జరిగిన సమావేశాల్లో మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. ఈటల మంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నా రు. వందల ఎకరాలు.. వేల కోట్లు సంపాదించుకున్నాడని, ఇదంతా ప్రజలు గమనించాలని కోరారు. ఏం అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ను వదిలిపెట్టాడో చెప్పకుండా.. ఆత్మగౌరవమంటూ మాట్లాడుతున్నాడన్నారు. ఎస్సీ, బీసీల ఉపాధికోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను ఈటల కొన్నాడని, ఫిర్యాదు చేసిన బాధితుల పక్షాన ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే పార్టీని వీడాడని చెప్పారు. బీజేపీ నాయకులకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతోపాటు మరో రూ.20 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధుపై అనుమానాలొద్దని, రాష్ట్రమంతటా అమలుచేస్తామని స్పష్టంచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. మంత్రివెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.