హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): నాందేడ్ సభ విజయంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. నిత్యం పార్టీలోకి నేతలు, కార్యకర్తలు వెల్లువలలా వచ్చి చేరుతున్నారు. ఆదివారం మహరాష్ట్రలోని ఔరంగాబాద్లో శంభాజీ బ్రిగేడ్ నుంచి జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 700 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్, ఆమ్ఆద్మీ, బీజేపీ, ఎన్సీపీకి చెందిన 700 మంది సంతోశ్ అవగనే ఆధ్వర్యంలో ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ జాతీ య కార్యదర్శి హిమాంశు తివారీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ మహారాష్ట్రలో రాజకీయ అస్తిరత ఉన్నదని, ఇక్కడ స్థిరమైన పాలనతో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలంటే బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో కూడా అధికారంలోకి రావాలని అన్నారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలనే రైతులంతా ముక్తకంఠంతో ‘అప్ కీ బార్.. కిసాన్ సర్కార్’ నినాదాన్ని అందుకొన్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాంశు తివారీ, మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో సంచలనాలు నమోదు చేస్తుందని పేర్కొన్నారు. ఔరంగాబాద్ బీఆర్ఎస్ నేత సోమనాథ్, శంభాజీ బ్రిగేడ్ ముఖ్యనేత సంతోష్ అవగనే మాట్లాడుతూ.. దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనున్నదని తెలిపారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో ఆదివారం పార్టీలో చేరిన నాయకులు