KTR | బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీ బీటీం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీతో గతంలో పొత్తు లేదని.. భవిష్యత్తులోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. భువనగిరి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలను, ఇద్దరు ఎమ్మెల్యేలను ఓడించామని గుర్తు చేశారు. కేసీఆర్ 45 ఏండ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు
బీటీం అయితే కవితపై కేసు పెట్టేదా?
బీఆర్ఎస్కు బీజేపీ బీటీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూశాయని విమర్శించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను ఓడించాయని అన్నారు. ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు వచ్చాయని అన్నారు. అమిత్ షాను రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పద్ధతి మారిపోయిందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా తమకు నిరాశ తప్పలేదని తెలిపారు.
అలా చేస్తే మేమూ గెలిచేవాళ్లమేమో!
బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ వాళ్లు పొలిటికల్ హిందువులైతే.. కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువు అని స్పష్టం చేశారు. తాము కూడా యాదాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచేవాళ్లేమేమో అని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నిజమైన సెక్యులర్ పార్టీ అని తెలిపారు. ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే పద్ధతి ఉంటుందని కేటీఆర్ తెలిపారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎంతమాత్రమూ సహించమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఉల్లంఘనలు సీరియస్గా తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పుడు కేసులను సమష్టిగా ఎదుర్కొంటామని తెలిపారు. ఒక కాకికి ఆపద వస్తే మిగతా కాకులు ఒక్కచోట చేరినట్లే.. పార్టీ కార్యకర్తకు ఆపద వస్తే అందరూ అలాగే నిలవాలని సూచించారు.