సింగరేణి సంస్థలో ఉద్యోగం అంటే ఆషామాషీ కాదు. అలాంటి సంస్థలో ఉద్యోగం వచ్చింది. ఒక రోజు పని చేశారు. మస్టర్ సైతం పడింది. ఏండ్ల తరబడి కష్టపడి చదివి.. ఎంట్రెన్స్ ఎగ్జామ్లో మెరిట్ సాధించి.. కోర్టు కేసులను ఎదుర్కొని.. చివరకు ఉద్యోగం సాధించి.. తొలి రోజు విధులు నిర్వహించామని సంబురపడేలోపే చేదువార్త అందింది.
మరుసటి రోజు నుంచి ఉద్యోగానికి రావొద్దంటూ అదే రోజు సాయంత్రం పిడుగులాంటి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. దీంతో సింగరేణి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2 ఉద్యోగాలు పొందిన 146 మంది ఆశలు ఆవిరయ్యాయి. అప్పటి నుంచి ఎవ్వరి దగ్గరకు వెళ్లినా.. ఉద్యోగాలపై స్పష్టత కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సింగరేణి సీఎండీ బలరాంను నాలుగైదుసార్లు కలిసినా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను వేడుకున్నా ఒకరిపై ఒకరు కారణాలు చెప్పి తప్పించుకొంటున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఉద్యోగాలు కూడా తామే ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడానికే కాంగ్రెస్ సర్కారు సింగరేణిలో రిక్రూట్మెంట్ను ఆపేసిందనే ప్రచారం జరుగుతున్నది.
Singareni |మంచిర్యాల, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ క్లరికల్ గ్రేడ్-2(ఎక్స్టర్నల్) పోస్టులకు 2022 జూన్లో నోటిఫికేషన్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో అదే ఏడాది సెప్టెంబర్ 4న పరీక్ష నిర్వహించింది. సెప్టెంబర్ 11న రిజల్ట్ కూడా వచ్చింది. అయితే.. పరీక్ష రాసిన వారిలో కొందరు కోర్టును ఆశ్రయించారు. మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థుల న్యాయ పోరాటంతో సింగిల్ బెంచ్ విచారణ అనంతరం డివిజన్ బెంచ్కి చేరింది. వాదోపవాదనలు, ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత 2023, సెప్టెంబర్ 21న జస్టిస్ షావలీ, జస్టిస్ అనిల్కుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వెంటనే వీరికి పోస్టింగ్లు ఇవ్వాలంటూ ఆదేశించింది.
ఈ మేరకు మెరిట్ లిస్ట్ ఆధారంగా అక్టోబర్ 3, 4 తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అందులో అర్హత సాధించిన వారికి మరుసటి రోజే మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు. అన్నీ సజావుగా జరుగుతున్నాయనుకున్న సమయంలో సింగరేణిలో అంతర్గత బదిలీలు, ఉద్యోగులకు కౌన్సెలింగ్లు అని చెప్పి కొంత ఆలస్యం చేశారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికలు పూర్తయ్యాక డిసెంబర్ 11న 146 మందిని ఎంపిక చేసి కౌన్సెలింగ్ నిర్వహించారు. అదేరోజు మెరిట్ ప్రకారం ఏరియాలు అలాట్ చేసి, జాయినింగ్ ఆర్డర్లు ఇచ్చారు. అప్పుడే సింగరేణి ఎంప్లాయ్మెంట్ కోడ్ జనరేట్ అయ్యింది.
ఉద్యోగం పొందిన అభ్యర్థులు 18న కేటాయించిన ఏరియాల్లో జీఎంలకు రిపోర్ట్ చేశారు. వారికి సెక్షన్లు కూడా అలాట్ చేశారు. దీంతో డిసెంబర్ 19న వాళ్లంతా విధులు నిర్వహించారు. మస్టర్ కూడా పడింది. అదేరోజు సాయంత్రం ఆయా ఏరియాల జీఎంల నుంచి రేపటి నుంచి విధుల్లోకి రావొద్దంటూ మౌఖిక ఆదేశాలు వచ్చాయి. తర్వాతి రోజు అడిగితే సింగరేణి ఎన్నికలు నడుస్తున్నయ్.. ఎన్నికల కోడ్ ఉందని ఆపేశామని చెప్పారు. చివరకు సింగరేణి ఎన్నికల కోడ్ ముగిశాక డిసెంబర్ 27న జీఎం ఆఫీసుకు వెళ్లి అడిగితే.. తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. దీనిపై సింగరేణి సీఎండీ బలరామ్ను నాలుగైదుసార్లు కలిసినా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసినా ఒకరిపై ఒకరు కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.
ఉద్యోగాలు పొందిన 146 మందిలో 29 మంది కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో, వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ, మున్సిపల్ శాఖల్లో వివిధ హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు. ఈ ఉద్యోగం వచ్చిందని వారంతా సింగరేణి నిబంధనల మేరకు డిసెంబర్ 1వ తేదీకి ముందుగానే పాత ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. మరో 40 మంది ప్రైవేట్ సెక్టార్లలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా, ఇతర కంపెనీల్లో పెద్ద హోదాల్లో పని చేసి సింగరేణి ఉద్యోగం వచ్చిందని రిజైన్ చేశారు. ఉద్యోగం ఇచ్చి ఒక రోజు పని కూడా చేయించుకున్న సింగరేణి యాజమాన్యం.. మరుసటి రోజే విధులకు రావొద్దని చెప్పడంతో ఈ కుటుంబాలన్నీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కొసమెరుపు ఏమిటంటే.. కౌన్సెలింగ్ జరిగిన రోజు ఈ 146 మందితో సింగరేణి సంస్థ రూ.2 లక్షలకు బాండ్ రాయించుకున్నది. ఈ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకున్నది. తాజాగా ఒకరిద్దరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. వాళ్లు వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే రూ.2 లక్షలు కడితేనే ఇస్తామంటూ అధికారులు చెప్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇటు ఉద్యోగం, అటు సర్టిఫికెట్లు ఇవ్వక నానా అవస్థలు పడాల్సిన దుస్థితి వచ్చింది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రూ.2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సింగరేణి సంస్థలో భర్తీ చేసే ఉద్యోగాలకు కాంగ్రెస్ తరఫున నియామక పత్రాలు ఇచ్చి ఆ క్రెడిట్ కొట్టేసేందుకు ఇదంతా చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సింగరేణి పబ్లిక్ సెక్టార్ కంపెనీ, ఉద్యోగాల రిక్రూట్మెంట్ అనేది ఆ సంస్థ అంతర్గత విషయం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకుండా ఇచ్చిన ఉద్యోగాలను ఆపి, ఉద్యోగులను ఇబ్బందులు పెట్టడం ఏమిటని సింగరేణి సంస్థలోనే ఉన్నత హోదాలో పని చేసే పలువురు పెదవి విరుస్తున్నారు.
ఇవేగాకుండా సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు కారుణ్య నియామకాలకు క్లియరెన్స్ పొందిన మరో 400కి పైగా పోస్టులను ఆపేశారు. ఇందులో శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరేందుకు సిద్ధమైన వారు 100 మందితోపాటు కొత్తగా శిక్షణకు అర్హత సాధించిన వారు 300 మందికిపైగా ఉన్నారు. ఈ ఉద్యోగాలు కూడా తామే ఇచ్చినట్టు ప్రచారం చేసుకోవడానికి, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా తిరిగి మరొకసారి నియామక ఉత్తర్వులు అందజేయడానినే సింగరేణిలో రిక్రూట్మెంట్ను ఆపేసిందనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
సింగరేణి ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణం చూస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది. సంస్థలో 177 ఇంటర్నల్, 177 ఎక్స్టర్నల్ నియామకాలు జరిగాయి. ఇందులో ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్లు ఇప్పటికే విధుల్లో చేరారు. ఎక్స్టర్నర్లో 146 మంది అర్హత సాధించారు. వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. రెండు రోజులు డ్యూటీ చేయించాక.. మరుసటి రోజే వారిని విధులకు రావొద్దని చెప్పడం సరికాదు. పరీక్ష విషయంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏ ప్రభుత్వానికైనా శిరోధార్యం. ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే మంచిది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఉద్యోగాల క్రెడిట్.. కేసీఆర్కు పోవొద్దని, తమకే రావాలని ఆపుతున్నారా అన్నది తెలియాలి.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి