హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో నిర్వహించిన బయో ఏషియా సదస్సు పెట్టుబడులకు సంబంధించి రాష్ర్టానికి లాభదాయకంగా మారింది. సదస్సుకు ముందు, సమావేశాల సందర్భంగా కూడా పలు కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా ఆదివారం అమెరికాకు చెందిన ఫాక్స్ లైఫ్ సైన్సెస్, ప్రపంచ అగ్రగామి సంస్థ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్, బ్రిటన్కు చెందిన ఈగల్ జెనోమిక్స్ తమ కార్యకలాపాల విస్తరణపై ప్రకటనలు చేశాయి.
ఫాక్స్ లైఫ్సైన్సెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ తెలంగాణలో ఎస్యూటీ (ఔషధ తయారీకి సింగిల్ యూజ్ టెక్నాలజీ)లో సామర్థ్యాల విస్తరణకు రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపింది. ఆ సంస్థ ఇదివరకే తమ మొదటి అంతర్జాతీయ ప్లాంట్ కోసం మన రాష్ర్టాన్ని ఎంచుకొని వేర్హౌస్, లాబొరేటరీ ఉత్పత్తుల కోసం వైట్ రూమ్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్లాస్-6 క్లీన్ రూమ్ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా ఫాక్స్ లైఫ్ సైన్సెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏక్నాథ్ కులకర్ణి మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధిలో భాగంగా తమ మొదటి అంతర్జాతీయ ప్లాంట్ కోసం హైదరాబాద్ను ఎంచుకోవడం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. రానున్న కాలంలో హైదరాబాద్లో లైఫ్సైన్సెస్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి కస్టమ్ మెడికల్, ఎస్యూటీ ఫార్మా అసెంబ్లీలను తక్కువ ధరలకే వినియోగదారులకు అందించేందుకు కట్టుబడి ఉనన్నామని తెలిపారు.
సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ ప్రయోగశాల
పర్టిక్యులేట్ మెటీరియల్స్ (నలుసు/కణాలు పదార్థాల)పై శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ప్రపంచ అగ్రగామి సంస్థ సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్ (ఎస్ఎంఎస్) గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రెండు మిలియన్ డాలర్ల (సుమారు రూ.16.58 కోట్లు) పెట్టుబడితో అధునాతన పార్టికల్ క్యారక్టరైజేషన్ ల్యాబొరేటరీస్(పీసీఎల్)ను ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. ఇదికాకుండా వచ్చే మూడేండ్లలో మరో మూడు మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్టు తమ ప్రణాళికను వెల్లడించింది. మంత్రి కే తారకరామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్లో పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీలను ప్రారంభిస్తున్నందుకు ప్రొఫెసర్ డారిల్ విలియన్స్తోపాటు ఆయన బృందాన్ని అభినందించారు. వారు విజయవంతంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ గత ఏడాది మేలో బ్రిటన్లో పర్యటించిన సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్తో సమావేశమయ్యారు. కాగా, కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయ ప్రమాణాలతో తమ సదుపాయాన్ని నెలకొల్పింది. పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీస్(పీసీఎల్) గ్లోబల్ రిసెర్చ్ కమ్యూనిటీకి సేవలు అందించేందుకు హైదరాబాద్లో ప్రారంభిస్తున్న నూతన కాంట్రాక్ట్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఆర్వో). ఈ ప్రయోగశాల ప్రత్యేక నిపుణులతో విస్తృతశ్రేణి కణ లక్షణాలకు సంబంధించిన సేవలను అందిస్తుంది.
ఈగల్ జినోమిక్స్ విస్తరణ
బ్రిటన్ ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ టెక్ బయో ప్లాట్ఫాం ఈగల్ జినోమిక్స్ హైదరాబాద్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్టు ప్రకటించింది. కొన్నేండ్ల క్రితం 20మంది సిబ్బందితో ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పటికే అధునాతన బయో ఇన్ఫర్మేటిక్స్, డాటా అనలిటిక్స్లో 61మందితో కార్యకలాపాలను సాగిస్తున్నది.