హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): పటిష్ఠమైన నిబంధనలు ఉన్నప్పుడు ఫార్మారంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపడతాయని, పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న కొద్దీ నియంత్రణ వ్యవస్థ పటిష్ఠమవ్వాలని పలువురు నిపుణులు పేర్కొన్నారు. బయో సిమిలర్ ఔషధాల ఉత్పత్తి పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా వాటికి సంబంధించిన రెగ్యులేటరీ వ్యవస్థ రానున్నదని, కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బయో ఏషియా సదస్సులో భాగంగా శనివారం రెండో రోజు ‘ఇండియా ఫర్ ఇండియా అండ్ ఇండియా ఫర్ వరల్డ్, నాణ్యత స్థానం ఎక్కడ’ అనే అంశంపై ప్యానల్ డిస్కషన్ నిర్వహించారు. ఈ చర్చలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఎఫ్డీఏ అసోసియేట్ కమిషనర్ ఫర్ గ్లోబల్ పాలసీ మార్క్ అబ్డూ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు దేశానికి సంబంధించిన సమస్య కాదని అది కంపెనీల సమస్య అని చెప్పారు. భారత్తో సహా నాణ్యమైన పరికరాలను తయారు చేసే సంస్కృతిని పెంచుకోవాల్సిన అవసరముందని సూచించారు. అమెరికా ఎఫ్డీఏ డైరెక్టర్ కార్మెలో రోసా మాట్లాడుతూ ప్రపంచంలో అనుసరించే విధానాన్నే తాము భారత్లో కూడా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎఫ్డీఏ ఇండియా డైరెక్టర్ సారా మెక్ముల్లెన్ మాట్లాడుతూ ఫార్మా రంగంలో రియాక్టివ్ మాడల్ కన్నా మరింత చురుకైనదాని కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఫార్మా రంగంలో పటిష్ఠమైన నిబంధనలు ఉండాలని, పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నప్పుడు నియంత్రణలు పెరుగుతాయని అన్నారు.
ఎన్ఎస్ఎఫ్ ఫార్మాస్యూటికల్స్ సర్వీసెస్ ఈడీ ఇయాన్ వైట్ మాట్లాడుతూ భారతదేశంలో ఏడు సంవత్సరాలుగా తనిఖీ చేస్తున్నానని, ప్రపంచంలో అత్యుత్తమ సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. దురదృష్టవశాత్తు ఇది బయటి ప్రపంచంలో అంతగా గుర్తింపు పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లినాయిస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్ఫరాజ్ కే నియాజీ మాట్లాడుతూ భారతదేశంలో నాణ్యత సమస్యను పూర్తిగా నివారించవచ్చని చెప్పారు. ఒక తప్పు జరిగినప్పుడు, తప్పుడు అవగాహన కారణంగా అది చాలా ప్రచారం పొందుతున్నదని, నివారించదగిన తప్పులను నిలువరించడం భారతీయ కంపెనీల బాధ్యత అని అన్నారు. బయోసిమిలర్ రెగ్యులేటర్ల కొత్త వ్యవస్థ వస్తున్నదని, కంపెనీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయోకాన్ బయోలాజికల్స్ చీఫ్ క్వాలిటి ఆఫీసర్ మైఖేల్ కట్టర్ మాట్లాడుతూ కఠినమైన తనిఖీలపై ఎఫ్డీఏ అధికారులను నిందించలేమని, బలమైన ఆధునిక నాణ్యతా వ్యవస్థ ఉంటే, అది భారతదేశంలోని పరిశ్రమకు సహాయపడుతుందని చెప్పారు. ఇక్కడి సంసృతి అద్భుతమైనదన్నారు. ఫార్మాకు కేంద్రంగా భారత్ ఉన్నదని, దీనిని అద్భుత అవకాశంగా మలచుకోవాలని సూచించారు.