హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో డిసెంబర్ ఒకటి నుంచి బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 405 జూనియర్ కాలేజీలుండగా.. ప్రతి కాలేజీలో 4 సీసీ కెమెరాలు, 2 బయోమెట్రిక్ హాజరు పరికరాలు బిగించి గతంలో బయోమెట్రిక్ హాజరును అమలుపరిచారు.
కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి దీనిని ఉపసంహరించారు. కరోనా తీవ్రత తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో మళ్లీ బయోమెట్రిక్ హాజరును అమలుచేయాలని నిర్ణయించారు. కాలేజీల్లో గతంలో బిగించిన బయోమెట్రిక్ పరికరాలు పనిచేస్తున్నాయో..? లేదోనని ఆరా తీస్తున్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారులు, నోడల్ అధికారులు ఆయా వివరాలను పంపించాలని మంగళవారం మెమో జారీచేశారు. వివరాలు అందిన తర్వాత పనిచేయని వాటికి రిపేర్లు చేయించి వినియోగంలోకి తీసుకురానున్నారు.