హైదరాబాద్, ఫిబ్రవరి 24 : లైఫ్సైన్సెస్లో హైదరాబాద్ ఎంతో పురోగతి సాధిస్తున్నదని బిల్, మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కొనియాడారు. హైదరాబాద్లోని వ్యాక్సిన్ కంపెనీలు ఒక్క భారత్కే కాకుండా ప్రపంచానికి వ్యాక్సిన్ అందించాయని హర్షం వెలిబుచ్చారు. హైదరాబాద్ వచ్చి వ్యాక్సిన్ కంపెనీలకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఆతృతగా ఉన్నానని పేర్కొన్నారు. కరోనా కారణంగా రెండేండ్లుగా ఎక్కడికీ వెళ్లడంలేదని, అవకాశం దొరికినప్పుడు తప్పకుండా హైదరాబాద్కు వస్తానని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ల తయారీలో భారత్ కృషి ఎంతో అమోఘమని, చాలా సంపన్న దేశాలకంటే ఎంతో మెరుగ్గా భారత్ వ్యాక్సిన్లను తయారుచేసి తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చిందని ప్రశంసలు కురిపించారు. బయోఏషియా సదస్సులో భాగంగా గురువారం బిల్గేట్స్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు (ఫైర్ చాట్).
ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి నుంచి తాను నేర్చుకొన్న అనుభవాలను వివరించారు. తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సమకాలీన సాధనాలతో, కొత్త సామర్థ్యాలను నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యపరమైన లోపాలు, ఆరోగ్య సంరక్షణ పంపిణీ వ్యవస్థల స్థితిగతులపై కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు బిల్గేట్స్ సమాధానాలిచ్చారు. వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రపంచానికి అందించడంపట్ల భారతీయ కంపెనీలను ఆయన ప్రశంసించారు. భారతదేశం గేట్స్ ఫౌండేషన్సహా గ్లోబల్ భాగస్వాములతో కలిసి గొప్ప వ్యాక్సిన్లను రూపొందించిందని చెప్పారు. ఎంఆర్ఎన్ఏ వంటి కొత్త వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. హెచ్ఐవీ, క్షయ, మలేరియా వంటి క్లిష్టమైన వ్యాధులకు వ్యాక్సిన్లను తయారుచేయడంలో ఇది దోహదపడుతుందన్నారు. మెరుగైన డయాగ్నస్టిక్స్, థెరప్యూటిక్స్, వ్యాక్సిన్లను రూపొందించేందుకు ప్రైవేటురంగం, విద్యాసంస్థలకు నిధులను సమకూర్చాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. పరిశోధన-అభివృద్ధి, అంటువ్యాధుల నివారణపై ఎక్కువగా ఖర్చుచేయాలన్నారు. క్యాన్సర్, గుండె, లేక నరాల వ్యాధులతో పోల్చితే అంటువ్యాధులు పెద్ద జబ్బుకాదన్న బిల్గేట్స్.. వాటిని కూడా తక్కువగా అంచనా వేయరాదని, ఎంతో మెరుగైన పద్ధతుల్లో నివారణ చర్యలు పాటించాలని కరోనా నేర్పిందని తెలిపారు. ఆవిష్కర్తలకు భారతదేశంలో అన్ని అవకాశాలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని ఆవిష్కర్తలు ముందుకు సాగాలని సూచించారు. యాంటిమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ఒక స్థిరమైన అభివృద్ధి సమస్యగా ఉన్నదన్న కేటీఆర్ ప్రశ్నకు స్పందిస్తూ, సూక్ష్మజీవుల నిరోధకత కారణంగా 1.3 మిలియన్ల మరణాలను అంతర్జాతీయ ఆరోగ్య కొలమానాలు అంచనా వేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా న్యుమోనియా, టైఫాయిడ్ వ్యాధిగ్రస్థులతోపాటు బాలింతలు ఎక్కువగా ఏఎంఆర్ బారినపడతున్నారని, ఇది అత్యంత విషాదకరమని చెప్పారు.క్లెబ్సియెల్లా న్యుమోనియా అనే బ్యాక్టీరియా నవజాత శిశువులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందనితెలిపారు. ఈ వ్యాధులపై చిన్న అణువులు, మందులు, లేక యాంటిబాడీస్తో దాడి చేయడం ద్వారా నివారించవచ్చునన్నారు.
సంభాషణ సందర్భంగా కేటీఆర్ ప్రశ్నలు.. బిల్గేట్స్ సమాధానాలు..
ఆరోగ్యం విషయంలో తుదపరి సాంకేతికత ఏదని మీరు భావిస్తున్నారు?
స్మార్ట్ వాచ్లు, ఇతర సాంకేతిక పరికరాలు ఆరోగ్యాన్ని పరీక్షించుకొని, ముందు జాగ్రత్తలు తీసుకొనేందుకు ఉపయోగపడతాయి. సరైన నిద్ర, ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యం అమూల్యమైనది. డిజిటల్ పరికరాలు ప్రైవసీ వంటి సవాళ్లను సృష్టిస్తున్నాయి.
యువతరం ఆరోగ్య నిపుణులకు ఏదైనా సలహా?
డిజిటల్ టూల్స్ మీరు అగ్రస్థానంలో నిలవడానికి సహాయపడతాయి. కొత్త టూల్స్ను తేవడమే కాదు వాటి ధరలను కూడా అందుబాటులో ఉండేలా చూడాలి. ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక శాస్త్రం, ఆరోగ్యశాస్త్రం రెండింటిలో చేయాల్సింది చాలా ఉన్నది. ఆరోగ్యం అత్యంత వృద్ధిచెందుతున్న రంగం. వృద్ధుల జీవితాలను మెరుగుపర్చుకునేందుకు అధునాతన పరిజ్ఞానం వస్తుందని ఆశతో ఉన్నా.
మీరు చూస్తున్న తదుపరి పెద్ద వైద్యం ఏమిటి?
హెచ్ఐవీని నయం చేయడమే నా ప్రథమ ప్రాధాన్యం. అలాగే పోషకాహార లోపం ఇప్పటికీ పెద్ద సమస్యగానే ఉన్నది. మైక్రోబయోమ్ను పదేండ్లలో అర్థం చేసుకోలేకపోయాం. మైక్రోబయోమ్ను స్వీకరించడం ద్వారా పోషకాహారలోపం లేకుండా చేయవచ్చు. ఇది వచ్చే పదేండ్లలో సాధ్యమవుతుందని అనుకుంటున్నాను. కొంత పురోగతి సాధించి జీవితాలను మెరుగుపర్చేందుకు వీలవుతుంది.
తెలంగాణ, హైదరాబాద్ బిల్-మిలిండా గేట్స్తో కలిసి పనిచేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చికిత్సలు సమర్థంగా, సరసమైనవిగా ఎలా చేయవచ్చు?
ఎంఆర్ఎన్ఏ అనేది మహమ్మారి యొక్క ఆశ్చర్యకరమైన నక్షత్రం. వైరల్ వెక్టర్, ప్రొటీన్ సబ్యూనిట్ ద్వారా విభిన్న పద్ధతుల్లో టీకాలు తయారుచేశాం. అయితే ఎంఆర్ఎన్ఏ యుఎస్, యూరప్ వెలుపల తయారీకి అందుబాటులో లేదు. మా ఫౌండేషన్ ఇప్పటికే భారతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నది. తద్వారా ఆ భాగస్వాములు ఎంఆర్ఎన్ఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. సికిల్ సెల్ వ్యాధి లేదా హెచ్ఐవీ వంటి వాటికి జన్యు చికిత్సను ఉపయోగించే విషయంలో మేము ఆలోచన చేస్తున్నాం. చికిత్స వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంపై దృష్టిపెట్టాం. భారతీయ ఇకోసిస్టంలో కొత్తవి ఆవిష్కరించడంతోపాటే ఖర్చు విషయానికి కూడా ప్రాధాన్యమిస్తారు. ఇది ఎంతో గొప్ప విషయం. జన్యుచికిత్సలోని అద్భుత సామర్థ్యాలను నిలుపుకోవడంతోపాటు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఇది వీలవుతుంది. ఈ దృక్పథాన్ని పంచుకొనే భాగస్వాములు భారత్లో ఉన్నందుకు సంతోషిస్తున్నాం.