హైదరాబాద్ : తెలంగాణలో మైనారిటీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బిహార్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి జమాఖాన్ కితాబిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేళ్ల స్వల్పకాలంలో అన్నిరంగాల్లోనూ అభివృద్ధి సాధించడం అభినందనీయమన్నారు. ఒక వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు రెండు రోజుల కిందట వచ్చిన తాను ఇక్కడ జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూశానన్నారు. బంజారాహిల్స్లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయాన్ని శనివారం మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీతో కలిసి జమాఖాన్ సందర్శించారు.
ఈ సందర్భంగా మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్, సొసైటీ కార్యదర్శి షఫీవుల్లా రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బిహార్ మంత్రికి వివరించారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, ఉన్నతికి రూ.9వేలకోట్లకుపైగా ఖర్చు చేసిందని తెలిపారు. తెలంగాణలో లౌకిక ప్రభుత్వం కొనసాగుతున్నదని, ఇక్కడ అన్ని మతాలు, ప్రాంతాలు, భాషలకు చెందిన వాళ్లు ప్రశాంతంగా జీవిస్తున్నారని, గంగా జమున తహజీబ్కు ఇది నిలువుటద్దమన్నారు.
విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ యువతకు రూ.20లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. పేదిండి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం షాదీముబారక్ కింద రూ.లక్ష, పదివేలమంది ఇమామ్లు, మౌజామ్లు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా 204 గురుకుల పాఠశాలలను నడుపుతున్నామని, ఇందులో 1.31లక్షల మంది విద్యార్థులకు ఆంగ్ల మాద్యమంలో బోధన అందిస్తున్నట్లు తెలిపారు.
ఆయా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని, క్రీడల్లో రాణిస్తున్నారని, అమెరికా నాసాను సైతం సందర్శించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జమాఖాన్ మాట్లాడుతూ ఇక్కడ విజయవంతంగా అమలవుతున్న పథకాలపై బిహారం సీఎం నితీశ్కుమార్కు వివరిస్తానన్నారు. రెండు మూడునెలల్లో తెలంగాణలోని గురుకుల పాఠశాలలను సందర్శిస్తానని, వీటిని ఆదర్శంగా తీసుకొని బిహార్లో అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీవుల్లా, హజ్ కమిటీ చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు.