బీజేపీ ముఖ్య నేత అమిత్షా ఆదివారం హైదరాబాద్ పర్యటనలో ఒక దళిత కార్యకర్త ఇంటికి వెళ్లారు. దళితులపై తమకెంతో ప్రేమ ఉన్నట్టు చాటుకోవడానికి ఆయన చేసిన ప్రతీకాత్మక ప్రయత్నమిది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అమిత్షా అక్కడ ఒక దళితుడి ఇంటికి వెళ్లడం ఆనవాయితీ. కానీ, సింబాలిజం ఎప్పుడూ సింబాలిజమే. కేవలం ఒక దళిత కార్యకర్త ఇంటికి వెళ్లి కాఫీ తాగడం వల్ల దళితులకు సాధికారత వస్తుందా? లేక చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం వల్లనా! మన ప్రయత్నాల్లో చిత్తశుద్ధి ఎంతో అబద్ధం వెంట నడిచి వచ్చే నిజమే చెప్తుంది.
ఇది బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ ప్రాంతంలోని రేతా నాగ్లా గ్రామంలో దృశ్యం. ఇక్కడ దినేశ్కుమార్ అనే దళిత కార్మికుడిని ఆ గ్రామ ప్రధాన్ (సర్పంచ్), పొరుగూరికి చెందిన అతని మిత్రులు కలిసి చెప్పులతో కొట్టారు. దినేశ్ సర్పంచ్ను విమర్శించడమే ఇందుకు కారణం. ఉత్తరప్రదేశ్… ఏండ్లుగా బీజేపీ పరిపాలనలో ఉన్నది. అటు కేంద్రంలోనూ గత ఎనిమిదేండ్లుగా బీజేపీయే అధికారంలో ఉన్నది. అంటే ‘డబుల్ ఇంజిన్’ పరిపాలన అన్నమాట. సబ్కాసాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ప్రవచించే బీజేపీ పాలనలోని యూపీలో ఈ సంఘటన జరిగి దాదాపు 15 రోజులు గడిచింది. కానీ, కేసు నమోదు కాలేదు. వీడియో క్లిప్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్నేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే యూపీలో ఈ సంఘటన జరిగేదా?
తెలంగాణలో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 90 వేల కొలువుల భర్తీ మొదలైంది.
మరి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ సర్కారు హామీ ఏమైంది? ఎవరు ఉద్యోగాలు ఇస్తున్నది? ఇవ్వనిది ఎవరు?
ఫసల్ బీమాను ప్రధాని మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్లోనే అమలుచేయట్లేదు. అక్కడ పనికిరాని పథకం తెలంగాణలో పనికొస్తదా?
ఈ పథకం లోపభూయిష్టమంటూ అన్ని రాష్ర్టాలు బయటకొచ్చాయి. రైతుల మేలు కోసం రాష్ట్రం కొత్త పాలసీ తెస్తున్నది.
వడ్లు కొనాల్సిందే కేంద్రం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినంక కొంటమనడమేంది?
రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నది కాబట్టే గత యాసంగిలో దొడ్డు వడ్లు కొనుగోలు చేయబోమని మీ నూకరాజు గోయల్ చెప్పిండని తేలిపోయింది కదా..
2014లో పెట్రోల్ లీటర్ ధర రూ.77.. దాన్ని రూ.120 దాకా పెంచింది ఎవరు? ఎనిమిదేండ్లలో పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పన్ను పెంచలేదు. ధరలు పెంచిందేమో కేంద్రం.. అమిత్షా ఏడుపు మాత్రం రాష్ట్రంపై.. ఇదీ కేంద్ర హోం మంత్రి వివేకం.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేరిక సందర్భంగా నల్లగొండ జిల్లా మునుగోడులో బీజేపీ ఆదివారం నిర్వహించిన సభ పేలవంగా సాగింది. హాజరైన వారికన్నా ఖాళీ కుర్చీలే అధికంగా కనిపించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షా, కిషన్రెడ్డి, నేతలు మాట్లాడుతున్నప్పుడు జనం నుంచి స్పందన కొరవడింది. నినాదాలివ్వాలంటూ నేతలు గొంతులు చించుకున్నా.. సభికులు సైలెంటుగానే ఉండిపోయారు.
8 నెలల క్రితం దళితబంధు పైసలతో సెంట్రింగ్ సామాన్ కొనుకున్నా. నా కొడుకు కిశోర్తో కలిసి సెంట్రింగ్ పనిచేస్తున్నా. ఇప్పటివరకు 15 బిల్డింగ్లకు సెంట్రింగ్ కొట్టిన. మరో ఆరుగురికి పని ఇస్తున్నా. చేతి నిండా పని ఉన్నది. అన్నం తినేందుకు కూడా టైం సరిపోతలేదు. ఇప్పటివరకు రూ.2 లక్షలు నిల్వకు వచ్చినయి. అంతా కేసీఆర్ సారు దయ.
– మాట్ల సుభాష్, కమలాపూర్
05.08.2021
ఎంపికైన లబ్ధిదారులు: 38,012
నగదు పొందినవారు: 36,678
గ్రౌండింగ్ యూనిట్లు: 19,495
మరి దళితుల కోసం 8 ఏండ్లలో బీజేపీ చేసిందేమిటి?
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): పేరులోనే పెద్ద కన్ఫ్యూజన్.. ఫ్లెక్సీ ల్లో ఆత్మగౌరవ సభ.. వేదికపై సమరభేరి సభ.. అసలు సభ పెట్టుకొన్నాయన ఏమో.. అది తన ఆత్మగౌరవ సభ అనుకొన్నాడు. చివరకు మునుగోడులో బీజేపీ గోడు.. గోడుగానే మిగిలింది. బీజేపీ నేతలు విషయం లేకపోయి నా గొప్పలకు పోవడం మునుగోడులో మరోసారి కనిపించింది. 3 లక్షల మందితో బ్రహ్మాండమైన సభ నిర్వహిస్తున్నామని ప్రకటించిన నేతలు.. 30 వేల మందిని కూడా తరలించలేకపోయారు. అమిత్ షా వేదిక మీదకు వచ్చేసరికి అందులో సగం కూడా సభలో లేరు. పైగా ఆయన మాట్లాడుతుంటే మాకు అక్కర్లేదన్నట్టుగా జనం వెనుదిరిగిపోయారు. ఆ వచ్చిన వారిలోనూ బీహార్ వలస కూలీలు, మైనర్లు.. ఇలా చాలామందిని మేనేజ్ చేసి తీసుకొచ్చారు. సభకు వచ్చిన సామాన్యులు మాత్రం వచ్చామా, వెళ్లామా అన్నట్టు కనిపించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరడానికి ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన సభకు బయటి ప్రాంతాలనుంచి ప్రజలను తరలించారు. మునుగోడులో బీజేపీకి బలం లేకపోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు పక్కనే ఉన్న మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లోని పార్టీ శ్రేణులు రప్పించారు. అమిత్షాను సభకు ఆహ్వానించిన నేపథ్యంలో మూడు లక్షల మందితో సభ నిర్వహిస్తామని రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. కానీ, సభకు అనుకున్నంత జన సమీకరణ జరుగకపోవచ్చని ముందునుంచే అనుమానం ఉన్న ట్టు తెలుస్తున్నది. సభ నిర్వహణ కోసం 40 ఎకరాలు సేకరించి కేవలం 10 ఎకరాలనే సభ ప్రాంగణం కోసం ఎంచుకొన్నారు. 4 షెడ్లను ఏర్పాటుచేసి వాటిని మొత్తం కుర్చీలతో నింపేసారు. సాధారణంగా వీఐపీ, మీడియా గ్యాలరీల్లోనే సాధారణంగా కుర్చీలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్న సభా ప్రాంగణాన్ని మొత్తం 20 వేల కుర్చీలతో కవర్ చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ 20 వేల కుర్చీలు సైతం సభ జరిగినంతసేపు ఎప్పుడూ పూర్తిగా నిండలేదు. కొంత వచ్చిపోయే వాళ్ల తో లెక్కేసినా వాళ్లు ప్రకటించిన దాంట్లో పదో వంతు కూడా కనిపించలేదు. సభ సాయం త్రం 4.30కు అని ప్రకటించగా మధ్యాహ్నం 3.30గంటల వరకు జనం రాలేదు. 4.30 నుంచే వెనుదిరుగుతూ కనిపించారు.
జన సమీకరణకు భారీగా డబ్బును వెచ్చించారు. గ్రామాల్లో ఉన్న పాత బీజేపీ నేతలు, రాజగోపాల్రెడ్డి అభిమానులకు జన సమీకరణ బాధ్యతలు అప్పజెప్పారు. చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటంతోపాటు పలు గ్రామా ల్లో స్థానిక బీహార్ వలస కూలీలకు రూ.500, పులిహోర, నీళ్ల బాటిల్, రాత్రికి మంచి మర్యా ద చేస్తామని చెప్పి తరలించారు. ఈ కూలీలను ఎక్కడికెళ్తున్నారని అడిగితే తమకేమి తెలియదని, పాంచ్ సౌ ఇస్తామంటే వెళ్తున్నామని చెప్పడం గమనార్హం. చివరకు పాఠశాలల విద్యార్థులు, మైనర్లు కూడా 500 రూపాయలు ఇస్తామంటే వచ్చామని వివరించారు. సభకు వచ్చిన వారిలో బీజేపీలో క్రియాశీలకంగా పని చేసే నేతలు, కార్యకర్తలు మినహా మిగతా జనం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. వృద్ధులు సైతం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఏమొస్తది, మీటింగ్కు పోతే ఇన్ని పైసలైనా వస్తయని వచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. చౌటుప్పల్ మండలంలో ఓ మహిళ ఏకంగా ఇస్తామన్న డబ్బుల విషయంలో మాట తప్పారంటూ బీజేపీ నేతలను నిలదీసిన వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
రాజగోపాల్రెడ్డి ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రసంగాన్ని ఆరంభించగానే జనం ఒక్కసారిగా లేవడం ప్రారంభించారు. సభలో ఉన్న జనం కూడా బయటకు బారులు తీరారు. పరిస్థితిని గమనించిన కిషన్రెడ్డి త్వరగానే తన ప్రసంగాన్ని ముగించారు. తర్వాత మాట్లాడాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్క నిమిషంలోనే పక్కకు తప్పుకొన్నారు. ఆయన తర్వాత మాట్లాడ్సాలిన తరుణ్ఛుగ్ అసలు ప్రసంగించలేదు. సభ ప్రాంగణం ఖాళీ అవుతుండటంతో బండి సంజయ్ నుంచి అమిత్షా మైకు అందుకున్నారు. ఆయన మాట్లాడే సమయానికి సభా ప్రాంగణం సగం ఖాళీ అయ్యింది.
నాలుగు షెడ్లల్లో ముందు భాగంలో ఉన్న షెడ్లల్లో ఉన్న ఆ పార్టీ శ్రేణులే కుర్చీల్లో కనిపించారు. మిగతా రెండు షెడ్లు దాదాపుగా ఖాళీ అయ్యాయి. అమిత్ షా ప్రసంగంలో కొత్త విషయాలేవీ లేక చప్పగా సాగింది. శనివారం మునుగోడు ప్రజాదీవెన సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విసిరిన సవాలుకు కూడా ఆయన జవాబు ఇవ్వలేకపోయారు. తన రాజీనామాతో మునుగోడు అభివృద్ధి అంటూ మొదలుపెట్టిన రాజగోపాల్రెడ్డి బీజేపీ పెద్దల సమక్షంలో స్థానికంగా పార్టీ తీర్థం పుచ్చుకోవాలనుకున్న లక్ష్యం నెరవేర్చుకోగలిగారు. తనతోపాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను, కార్యకర్తలను బీజేపీలోకి తీసుకెళ్లాలనుకున్న ప్రయత్నంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరైతే వ్యక్తిగతంగా సన్నిహితులై పార్టీ నేతలుగా ఉన్నవారే ఈ సభలోనూ కనిపించారు. గ్రామ, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో మెజార్టీ భాగం ఈ సభకు దూరంగా ఉండటం రాజగోపాల్రెడ్డికి మింగుడుపడని అంశమే. పాత బీజేపీ శ్రేణులతోపాటు తన వ్యక్తిగత అనుచర వర్గంతోనే సభను నడిపించాల్సి వచ్చింది. అందుకే రాజగోపాల్రెడ్డి భాషలో ఆత్మగౌరవ సభ అయినా, లేదా బీజేపీ పెద్దలు సూత్రీకరించిన భాషలో సమరభేరి సభ అని పిలిచినా పస లేని సభగానే మిగిలిందన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.