హైదరాబాద్/సిటీబ్యూరో అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై నమోదు చేసిన ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ యాక్ట్)ను ప్రయోగించడాన్ని పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు సమర్థించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ను బోర్డు విచారించినట్టు తెలిసింది. రాజాసింగ్పై పీడీయాక్ట్ ఎత్తివేయాలని భా ర్య ఉషాబాయి చేసిన అభ్యర్థన మేరకు బోర్డు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ విచారణలో రాజాసింగ్ చేసిన విద్వేషపూరిత ప్రసంగాలు, సోషల్మీడియాలో పోస్టులు, వాటిపై వివిధ ఠాణాల్లో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను నగర పోలీసులు బోర్డు ముందుంచారు. శాంతి భద్రతల పరిరక్షణ లో పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైనదేనని బోర్డు సమర్థించింది.
కక్షపూరితంగా రాజాసింగ్పై పీడీయాక్ట్ నమోదు చేశారన్న ఆరోపణలకు సరైన ఆధారాలే లేవని తేల్చిం ది. పీడీయాక్ట్ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యదర్శి వీ శేషాద్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్ప ద వ్యాఖ్యలతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తూ, ప్రశాంతతకు భంగం కల్గిస్తుండటంతో రాజాసింగ్పై ఆగస్టు 25న పీడీ యాక్టు ప్రయోగించారు. ఆగస్టులో రాజాసింగ్ చేసిన ఒక వీడియో నగరంలో ఆందోళనలకు ఆజ్యం పోసి, మత ఘర్షణలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్న కేసులను ఆరాతీసిన నగర పోలీస్ కమిషనర్.. రాజాసింగ్పై పీడీ ప్రయోగించిన విషయం తెలిసిందే.