అన్నా అంటే ఆదుకునే ఆపన్నహస్తుడు.. సౌమ్యుడు, వివాదరహితుడు, ప్రజా శ్రేయస్సు కోరుకునే నాయకుడు.. జనం మనిషి.. సు‘జల’ దాత.. చిన్నాపెద్ద, ముసలీముతక అనే తేడా లేకుండా సాయం చేస్తున్నారు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి. పైళ్ల ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. భువనగిరితోపాటు ఆలేరు నియోజకవర్గంలోనూ బోర్లు వేయించి, వాటర్ ప్లాంట్లు కట్టించి నీళ్ల మనిషిగా ముద్ర వేసుకున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు కరువుతో అల్లాడుతుండేవి. తాగడానికి చుక్క నీరు కూడా దొరికేది కాదు. అలాంటి సమయంలో ప్రజలకు మేలు చేయాలని శేఖర్రెడ్డి తపించారు. రెండు నియోజకవర్గాల్లో బోర్లు వేయించారు. ఒక్కో గ్రామంలో మూడు, నాలుగు బోర్లు వేయించి నీళ్లు అందించారు. 313 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అవి ప్రస్తుతం నిరంతరాయంగా నడుస్తున్నాయి. ఇంటింటికీ వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ప్రజల నీటి సమస్యను తీర్చి ఆత్మబంధువు అయ్యారు. ఆయన చేసిన సేవలకుగాను సుజల దాత, నీళ్ల మనిషి అని బిరుదును పొందారు.
ఎమ్మెల్యే శేఖర్రెడ్డి దయార్ద్ర హృదయుడని చెప్పవచ్చు. ఇతరులు బాధలో ఉంటే చూడలేని మనస్తత్వం. ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆపదలో ఉంటే సాయం చేసే గుణం ఆయనది. వందల మంది పేదలకు ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించారు. కాళ్లు పోయినోళ్లకు, అనాథలు, అప్పుడే పుట్టిన పిల్లలను అన్నివిధాలుగా ఆదుకున్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలిచారు. ఇప్పటి వరకు 570 కుటుంబాలకు నగదు సాయాన్ని అందించారు. కరోనా సమయంలో ఇంటింటికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పైళ్ల శేఖర్రెడ్డి స్వతహాగా బిజినెస్మెన్. ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చారు. పైళ్ల ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి ఉద్యమ సారథి కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్లోకి వచ్చారు. భువనగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లోనూ గెలిచిన శేఖర్రెడ్డి.. హ్యాట్రిక్ విజయం కోసం తాజా ఎన్నికల బరిలో నిలిచారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు.
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి యువతకు తన సొంత డబ్బులతో టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించారు. ఇందుకోసం తన క్యాంప్ ఆఫీసులో ప్రత్యేకంగా కొందరిని నియమించారు. అవసరం ఉన్నోళ్లు దరఖాస్తులు తీసుకొని వస్తే మిగతా ప్రక్రియ క్యాంప్ ఆఫీసు చూసుకుంటుంది. ఈ మేళాకు యువత నుంచి అపూర్వ స్పందన లభించింది. 12వేల మందికి ఉచితంగా లైసెన్స్లు ఇప్పించారు.