సంగారెడ్డి అర్బన్/పటాన్చెరు, జూలై 31: లాభాపేక్ష లేకుండా రోజూ 65 వేల మందికి ఉచితంగా భోజనాలు పంపిణీచేస్తున్న హరేకృష్ణ ఫౌండేషన్ సేవలు మహాద్భుతమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కొనియాడారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్షయపాత్ర మెగా కిచెన్ ఆవరణలో కృష్ణ మందిరం, సాంస్కృతిక కేంద్ర నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఆపదలో ఉన్నవారు, దవాఖానలో సహాయకులు, పట్టణాల్లో వలస కార్మికులు ఇలా లక్షల మందికి భోజనాలు అందిస్తున్న ఘనత ఈ ఫౌండేషన్దేనన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హరేకృష్ణ ప్రాంతీయ అధ్యక్షుడు సత్యగౌరదాస్ మాట్లాడుతూ.. కందిలో నిర్మించిన అక్షయపాత్ర ప్రపంచంలోనే మెగా కిచెన్గా నిలిచిందన్నారు.
తమకు అన్నివిధాలా మద్దతునిస్తూ సంస్థను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు హరీశ్రావు పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాలను పరిశీలించి, బోధన, వ్యాక్సినేషన్, ఇతర సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా గురుకులాలను అభివృద్ధి చేస్తున్నదని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు అత్యుత్తమైన విద్యాబోధన అందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.