హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): గోల్డ్లోన్ డోర్ స్టెప్ స్కీమ్ను ఆసరాగా చేసుకొని మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా వేసిన ఘటనలో కీలక వ్యక్తి ఇంటి దొంగేనని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. గత నెలలో జరిగిన ఈ స్కామ్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ కేంద్రంగా సాగినట్టు తేల్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. భువనేశ్వర్లోని మణప్పురంశాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. హైదరాబాద్లోని మణప్పురంశాఖలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు ఫోన్ చేశాడు. ‘హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా.. మీ వద్ద సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేయడం లేదు. మీ ఎంప్లాయి ఐడీ, పాస్వర్డ్లు చెప్పండి’ అంటూ వివరాలు తీసుకున్నాడు. అనంతరం హైదరాబాద్లోని హిమాయత్నగర్ చిరునామాతో డమ్మీ దరఖాస్తు చేశాడు. దానిని తన వద్ద ఉన్న యూజర్ ఐడీ, పాస్వర్డ్లో పరిశీలించినట్టు రిపో ర్టు తయారుచేసి.. దరఖాస్తుదారుడికి రూ.30 లక్షల రుణం మంజూరు చేయాలని ప్రధాన కార్యాలయానికి నివేదించాడు.
దరఖాస్తుదారు నుంచి 1,200 గ్రాముల బంగారాన్ని తీసుకొని సంస్థలో అప్పగించినట్టు ఆ రిపోర్టులో రాశారు. దీంతో దరఖాస్తుదారుని ఖాతాకు మణప్పురం ప్రధాన కార్యాలయం రూ.30 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత రికార్డులను పరిశీలించగా.. అతను పేర్కొన్న 1,200 గ్రాముల బంగారం నిల్వలో కనిపించలేదు. దీంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి, ఆ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఆధారంగా ఉద్యోగులను ప్రశ్నించారు. తాము ఎవరి వద్దకు వెళ్లలేదని, కేంద్ర కార్యాలయం నుంచి ఎవరో ఫోన్చేసి తమ యూజర్ ఐడీ, పాస్వర్డ్లు తీసుకున్నారని ఆ ఇద్దరు ఉద్యోగులు చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారం స్కామ్ జరిగిందని తెలుసుకున్న మణప్పురం ప్రతినిధులు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు భువనేశ్వర్లో నిందితుడిని అదుపులోకి తీసుకొని నగరానికి తరలిస్తున్నారు.