హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐ (యూ) పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహారెడ్డి చరిత్ర తెలంగాణ సమాజానికి గర్వకారణమని ఎంసీపీఐ (యూ) నేతలు కొనియాడారు. ఆదివారం హైదరాబాద్లోని ఓంకార్భవన్లో భీంరెడ్డి నరసింహారెడ్డి 103వ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా భీంరెడ్డి చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భీంరెడ్డికి ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించేలా సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టాలని వారు కోరారు. భీంరెడ్డి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రకమిటీ సభ్యుడు వల్లెపు ఉపేందర్రెడ్డి, వనం సుధాకర్, నార్ల చంద్రశేఖర్, గాదగోని రవి, మాడిశెట్టి అరుణ్కుమార్, భారత ఐక్య విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు తాటికొండ రవి, మాదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.