హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు సౌకర్యం కల్పించాలని వివిధ సంఘాల ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం వారు సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమ సమస్యలను విన్నవించారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు నవంబర్ వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నట్టు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నేతలు రాజాభాను చంద్రప్రకాశ్, గిరిధర్ తెలిపారు.
సమగ్రశిక్ష పథకానికి ప్రభు త్వం 40% గ్రాంట్ కింద 150 కోట్లు విడుదల చే స్తే కేంద్రం నుంచి 600 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉన్నదని వివరించారు. టీచర్లు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ అధ్యక్షుడు ఉమాశంకర్రెడ్డి వినతిపత్రం సమర్పించారు. 7 నెలలుగా వేతనాలు రావడం లేదని తెలంగాణ రాష్ట్ర గోపాలమిత్ర సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకు శ్రీనివాస్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాజు, ఆంజినేయులు తెలిపారు. ఎస్సీఈఆర్టీలో అక్రమ డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేసి పాఠశాలలకు పంపాలని లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు సానా సురేందర్, మామిడోజు వీరాచారి తదితరులు ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశంను కోరారు.