హైదరాబాద్ : తన పరిపాలనా దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహా రావుకు భారతరత్న ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీవీ 101 జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పీవీ ఘాట్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరం అన్నారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి లోకి తీసుకొచ్చిన పీవీకి భారత రత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చాటి చెప్పిన పీవీకి సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వకపోవడం విచారకరం అన్నారు.
పీవీ శతజయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహిస్తుందన్నారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్కు పీవీ మార్గ్గా నామకరణం చేయడంతో పాటు భారీ విగ్రహం కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. పీవీ మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచే ఉంటారని మంత్రి తెలిపారు.