వ్యవసాయ యూనివర్సిటీ, నవంబర్ 17: కొన్ని దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే పశువుల నుంచే మహమ్మారి మనుషులకు పాకి ప్రాణాపాయం తెచ్చిపెట్టిందని భారత్ బయోటెక్ చైర్మన్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. స్వైన్ఫ్లూ, బర్డ్ ఫ్లూతో ప్రకృతి ముందే హెచ్చరించిందని, తర్వాత కొవిడ్ విశ్వరూపంతో ప్రపంచం వణికిపోయిందని గుర్తుచేశారు. సమీప భవిష్యత్తులోనూ పశువుల నుంచి మరో మహమ్మారి భయపెట్టనున్నదని పేర్కొన్నారు.
కొవిడ్కు వ్యాక్సిన్లు తయారుచేయటంతో ప్రపంచదేశాలు మన వైపే చూస్తున్నాయని, పశువుల రోగాలపై శాస్త్రీయ పరిశోధనలు పెరగాలని సూచించారు. గురువారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారతీయ వెటర్నరీ సంఘం ఆధ్వర్యంలో 39వ అంతర్జాతీయ వెటర్నరీ పాథాలజీ కాంగ్రెస్ సదస్సు తొలిరోజు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మరో మహమ్మారి రాకుండా పసిగట్టి ప్రత్యామ్నాయం చూపాల్సిన బాధ్యత మనపైనే ఉన్నదని, పశువుల రోగ నిర్ధారణలో కృత్రిమ మేధస్సు, డిజిటలైజేషన్ అనుసంధానం తక్షణ అవసరమని స్పష్టంచేశారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా జంతుజాలం రోగాల బారిన పడుతున్నదని, శతాబ్దకాలంలో 15కుపైగా అత్యంత ప్రమాదకర రోగాలు ప్రబలాయని చెప్పారు. స్పానిష్ ఫ్లూ, ఎల్లో ఫీవర్, చికున్గున్యా, మలేరియా, రేబిస్ తదితర వైరస్లతో అపార ప్రాణనష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. పశువుల నుంచి మానవాళికి వచ్చే రోగాలను సాంకేతికతో గుర్తించి కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. పశువులకు వచ్చే రోగాల నిర్లక్ష్యం చేస్తే, మనకే చుట్టుకుంటాయని హెచ్చరించారు. అన్నిరకాల రోగాలను గుర్తిం చే అధునాతన పరికరాలు వ్యవసాయ వర్సిటీలో ఉన్నాయని, పరిశోధనలను ఉధృతం చేయాలని సూచించారు.
శాస్త్రవిజ్ఞానం, రైతుల ముంగిటికి చేరాల్సిన అవసరం ఉన్నదని పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్సిన్హా అభిప్రాయపడ్డారు. పశువుల్లో టీకాల ఆవశ్యకతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్(ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీఎన్ త్రిపాఠి సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ రవీందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మరో రెండురోజులు పశువులు, కోళ్ల వ్యాధుల సమస్యలు, నిర్ధారణపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వీరోజీరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లక్ష్మణ్, వివిధ దేశాల పశువైద్య శాస్త్రవేత్తలు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.