Bharat Bhawan | ఒక మనిషి ఆలోచనల విస్తృతి ఎంత? ఒక నాయకుడి మేధా వికాసపు సరిహద్దులు ఎక్కడిదాక? రాష్ట్రమా? దేశమా? ఖండమా? ప్రపంచమా? భూగోళమా?
294 నియోజకవర్గాల్లో ఒకదానికి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి.. అణగారిన జాతుల సమస్యలపై కూలంకష అధ్యయనానికి సబాల్టన్ స్టడీస్ సెంటర్నే ఏర్పాటు చేయిస్తే, ఆయన ఆర్తిని ఏమని విశ్లేషించాలి?
ప్రభుత్వంలో అందరిలాగే ఒక శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి.. ముఖ్యమంత్రిని ఒప్పించి, తరతరాలు ఐఏఎస్లకు, అధికారులకు శిక్షణ ఇచ్చే స్థాయిలో అద్భుతమైన (మర్రి చెన్నారెడ్డి) మానవ వనరుల అభివృద్ధి సంస్థను నిర్మింపజేస్తే, ఆయన ముందుచూపును ఏమని నిర్వచించాలి?
“స్థానిక ప్రజలైన రెడ్ ఇండియన్లపై చేసిన దౌర్జన్యాలను, పాపాలను అమెరికా ఇవాళ ప్రక్షాళన చేసుకున్నట్టయింది… నల్ల జాతీయుడైన బరాక్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ద్వారా!” అని ఒక రాష్ట్ర నాయకుడు వ్యాఖ్యానిస్తే, ఆయన లోతును ఏమని కొలవాలి?
క్యాపిటలిజం నుంచి కమ్యూనిజం దాకా, లెనిన్ బోల్ష్విక్ విప్లవం నుంచి మావో లాంగ్మార్చ్ దాకా విజయాలున్నాయి, వైఫల్యాలూ ఉన్నాయి. మార్సిజం నుంచి నక్సలిజం దాకా ఒక భూమిక ఉంది. దేన్నీ తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రపంచ పరిణామమూ మానవాళికి ఒక పాఠం లాంటిదే. వీటిని అధ్యయనం చేయడం మానవ జాతి పురోగమనానికి అవసరం. అందుకే భారత్ భవన్ను ఒక విశ్వ మానవ వికాస నైపుణ్య విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దాలనుకుంటున్నాను.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 5, (నమస్తే తెలంగాణ) కేసీఆర్ ఆలోచనా పరంపరలోంచి పుట్టుకొచ్చిన మరో అద్భుతమే భారత్ భవన్! ఒక జాతి విముక్తి కోసం పోరాడి, విజయుడై, ఒక రాష్ట్ర ఆవిర్భవానికి కారకుడై, ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధి సాధకుడైన వ్యక్తి, మానవాళి గతిని, భవితను నిర్దేశించే రాజకీయాలలో నాణ్యత కోసం, మేలిమి కోసం తలపెట్టిన కార్యక్రమమే భారత్ భవన్! ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేసిన భారత్ భవన్ విస్తృత లక్ష్యాల సమాహారమని పార్టీలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలియజేశాయి. రాజకీయం, ఎన్నికలు, గెలుపు ఓటములు, అధికారం అనే సంకుచిత లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా, విశ్వ కల్యాణం, మానవ శ్రేయస్సు కోసం కలకాలం, తరతరాల పాటు వివిధ రంగాల్లో నిపుణులను, మేధావులను తయారు చేసే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలన్నది కేసీఆర్ సంకల్పమని వివరించాయి.ఇది బీఆర్ఎస్కు అనుబంధంగా ఏర్పడుతున్నప్పటికీ, ఇది పార్టీ అనుబంధ విభాగం కాదని పేర్కొన్నాయి.
50 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో, ఒక మనిషి తన జీవిత కాలంలో సాధించలేనన్ని లక్ష్యాలను ఫలవంతం చేసుకున్న ఒక నాయకుడు, భావి తరాల కోసం సమర్థులైన నాయక శ్రేణిని, నైపుణ్య సమూహాన్ని సృష్టించడానికి వేసిన పునాది ఇది అని ఆ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్లోని అత్యున్నతస్థాయి వర్గాలు తెలియజేసే వివరాల ప్రకారం… భారత్ భవన్ ఒక నాలెడ్జ్ టవర్గా ఉండబోతున్నది. దీని ట్యాగ్లైనే… సెంటర్ ఆఫ్ నాలెడ్జ్ టవర్, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, సెంటర్ ఆఫ్ రిసర్చ్ అని ఉంటుంది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఈ సెంటర్లో లోతైన పరిశోధన జరుగుతుంటుంది. ఆర్థిక, పర్యావరణ, వాతావరణ, రాజకీయ, రక్షణ, తదితర అనేక రంగాల్లో అంతర్జాతీయంగా విఖ్యాతి చెందిన నిపుణులు, మేధావులు ఈ పరిశోధనల్లో, చర్చల్లో పాల్గొంటారు. శిక్షకులుగా వ్యవహరిస్తారు.
“ఇన్నేండ్ల ప్రాపంచిక పరిణామాలు స్పష్టం చేస్తున్నదేమంటే.. ప్రపంచ మానవాళి పురోగతికి ప్రజాస్వామ్యం ఒక్కటే పరిష్కారం. ఆ ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలే ప్రధాన ఆధారం. ప్రజాస్వామ్యం ఉంటేనే పార్టీలు బతికుంటాయి. పార్టీలు సరైన రీతిలో వ్యవహరిస్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఈ రెండూ లేని రోజు భారత్ మరో పాకిస్థాన్ అవుతుంది. భారత్లో ప్రజాస్వామ్యం ఉంది కనుకే తెలుగుదేశం, బీఆర్ఎస్, వైసీపీ, ఆప్, బీఎస్పీ తదితర అనేక పార్టీలు అవతరించగలిగాయి. తమ లక్ష్యాల కోసం పోరాడగలిగాయి. ఫలితాలను సాధించగలిగాయి. రాజకీయాల్లో స్పేస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఆ స్పేస్ ఉండాలంటే దానికి తగిన సైద్ధాంతిక భూమికను ప్రతిపాదించే సిద్ధాంతకర్తలు, నాయకులు రావాలి. అలా రావాలంటే అందుకు తగిన ప్రాతిపదికను, వాతావరణాన్ని సిద్ధం చేయాలి. భారత్ భవన్ను ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ నిర్ణయం ఇందులో భాగమే” అని బీఆర్ఎస్ ముఖ్యుడొకరు వివరించారు.
ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిన తరుణంలో ఏ దేశమూ మరొకదానితో సంబంధం లేకుండా మనుగడ సాగించలేదు. ఇప్పుడు దేశాలను కాదు, ప్రతి మనిషినీ అంతర్జాతీయ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయాల అవగాహన, అర్థమే మా రిపోతున్నది. అందువల్ల రేపటి రోజుల్లో నాయకులకు, నిపుణులకు ప్రపంచం గురించిన పరిజ్ఞానం, అంతర్జాతీయ రాజకీయ దృక్పథం అనివార్యమవుతుంది. సమీప భవిష్యత్తులో అంతర్జాతీయ, జాతీయ అవగాహన లేకుండా రాజకీయాలు చేయడం అసాధ్యమవుతుంది. 50 ఏండ్లుగా రాజకీయాల మంచి చెడ్డలను, మార్పు చేర్పులను దగ్గరి నుంచి గమనించిన కేసీఆర్.. తన జీవితాశయంగా, భవిష్యత్తు తరాలకు ఒక రాజకీయ వైజ్ఞానిక కేంద్రాన్ని ఇవ్వాలని భావించారు. ఈ క్రమంలోనే ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు చర్చిం చి, విశ్లేషించి, పరిష్కారాలను అన్వేషించే బృహత్తర లక్ష్యంతో భారత్ భవన్కు శ్రీకారం చుట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ భవన్ ప్రపంచస్థాయి నాయకులను తయారు చేసే ఒక నాలెడ్జ్ టవర్. అధ్యయన కేంద్రం.
‘ప్రజాస్వామ్యం అనే భావన పురుడుపోసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. అనేక విప్లవాలు చోటుచేసుకున్నాయి. అనేక భావజాలాలు అవతరించాయి. ఆలోచనలు సంఘర్షించాయి. సిద్ధాంతాలు యుద్ధం చేశాయి. కొన్ని ఆవేశాలు ఆయుధాలు పట్టాయి. శాంతియుత సమరాలు విజయాలు సాధించాయి. క్యాపిటలిజం నుంచి కమ్యూనిజం దాకా, లెనిన్ బోల్ష్విక్ విప్లవం నుంచి మావో లాంగ్మార్చ్ దాకా విజయాలున్నాయి, వైఫల్యాలూ ఉన్నాయి. మార్సిజం నుంచి నక్సలిజం దాకా ఒక భూమిక ఉంది. దేన్నీ తప్పుగా చూడాల్సిన అవసరం లేదు.
ప్రతి ప్రపంచ పరిణామమూ మానవాళికి ఒక పాఠం లాంటిదే. వీటిని అధ్యయనం చేయడం మానవ జాతి పురోగమనానికి అవసరం. అందుకే భారత్ భవన్ను ఒక విశ్వ మానవ వికాస నైపుణ్య విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దాలనుకుంటున్నాను” అని కేసీఆర్ అన్నట్టు ఆయనకు సన్నిహితంగా ఉండే ఒక నాయకుడు చెప్పారు. యుద్ధాలకు కారణం ఏమిటి? తెరవెనుక పాత్ర పోషించే శక్తులు ఏమిటి? యుద్ధాల వల్ల నష్టాలేమిటి? వాటిని నివారించే మార్గాలేమిటి? మానవ కల్పిత విపత్తులతో పాటు ప్రళయాలు, సంక్షోభాలను తట్టుకోవడానికి ఏం చేయవచ్చు తదితర అంశాలపై భారత్ భవన్లో సమగ్రమైన, సమూలమైన పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
భారత్ భవన్ దృష్టిపెట్టబోతున్న మరో కీలక చర్చనీయాంశం జస్టిస్ డెలివరీ సిస్టమ్. ఆధునిక భావనలు అనేక తెరపైకి వస్తున్న తరుణంలో ఏది న్యాయం ఏది అన్యాయం అనే ఒక చర్చ విసృతంగా సాగుతున్నది. న్యాయ సూత్రాలకు కొత్త భాష్యం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు కూడా న్యాయంపై మన భావనను ప్రభావితం చేస్తున్నాయి. సత్వర న్యాయం సాధించడం ఎట్లా? న్యాయం ఆలస్యమైతే జరిగే నష్టం ఎలాంటిది? అంతర్జాతీయంగా వ్యాపార, ఆర్థిక, సామాజిక రంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, న్యాయానికి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు రేపటి రోజుల్లో ఎలా ఉండాలి? అనే అంశాలపై అధ్యయనం జరగాల్సి ఉంది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు వంటి వ్యవస్థలను కాపాడుకునేందుకు, బలోపేతం చేసుకునేందుకు, స్వతంత్రతను కల్పించేందుకు, ఒత్తిడుల నుంచి విముక్తి కలిగించేందుకు ఎలాంటి ఏర్పాట్లు అవసరం ఇలాంటి అన్నింటిపైనా భారత్భవన్లో లోతైన అధ్యయనం జరగనుంది. ప్రఖ్యాతిగాంచిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు ఇందులో పాలుపంచుకుంటారు. “కేసీఆర్ రూపం చిన్నది. ఆలోచన పెద్దది. థింక్ బిగ్ అన్న మాటకు అసలు సిసలు రూపం ఆయన. ఆయన ఆలోచనలు అంత తొందరగా అందవు. ప్రపంచ మానవాళికి మేలు చేసే ఒక విశ్వ కల్యాణ వేదికగా భారత్ భవన్ను మలచాలన్నది కేసీఆర్ యోచన. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి, అద్భుతమైన ఫలితాలు సాధించిన నాయకుడిగా, రాజకీయ రంగానికి తద్వారా ప్రపంచానికి తనవంతుగా ఒక అపురూపమైన అధ్యయన కేంద్రాన్ని అందించాలని ఆయన భావిస్తున్నారు.
అందులో భాగమే భారత్ భవన్. సంకుచిత రాజకీయాలకు ఇది అతీతం. పార్టీలు, ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే ఇలాంటిది ఒకటి అవసరమన్నది ఆయన ఆలోచన. ప్రజాస్వామ్యం పట్ల ఆయన అనురక్తికి ఇదొక ఉదాహరణ. ప్రజాస్వామ్యం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది కనుకే ఆయన ప్రతిపక్షాన్ని కూడా ఆదరిస్తారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ భవనం కట్టుకుంటామని అడిగితే బోయిన్పల్లిలో 10 ఎకరాల స్థలాన్ని ఆయన కేటాయించారు. అందువల్ల చిల్లమల్లర రాజకీయాలకు భారత్భవన్ అతీతం” అని బీఆర్ఎస్ ముఖ్యనేత ఒకరు వివరించారు. భారత్ భవన్ నిర్మాణానికి 50-60 కోట్ల దాకా ఖర్చు వస్తుందనీ, ఆ ఖర్చును బీఆర్ఎస్ భరిస్తుందనీ ఆయన వివరించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఇప్పటికే ఒక నెల వేతనాన్ని భారత్ భవన్కు విరాళంగా ఇవ్వడానికి అంగీకరించినట్టు తెలిసింది.
భారత్ భవన్ భవనం 15 అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో మూడు భారీ మీటింగ్ హాల్స్ ఉంటాయి. ఒకదాంట్లో 1,100 మంది, మరో దాంట్లో 500 మంది, మూడో దాంట్లో 300 మంది సమావేశాలు నిర్వహించుకోవచ్చు. వీటితోపాటు 50 మంది చొప్పున శిక్షణ పొందగల 6 క్లాస్రూమ్స్ కూడా ఉంటాయి. వరల్డ్ బెస్ట్ లైబ్రరీ ఉంటుంది. ఇందులో శిక్షణ ఇచ్చేందుకు వచ్చే ప్రముఖులు బస చేయడం కోసం అనేక సూట్స్ కూడా ఉంటాయి. భారత్ భవన్కు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డైరెక్టర్గా వ్యవహరిస్తారు. దాదాపు 56 మంది విజిటింగ్ ప్రొఫెసర్లు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో నోబెల్ విజేతలు, ప్రపంచస్థాయి ఆర్థిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు.
ఈ మేరకు కేసీఆర్ ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆర్థిక వేత్తలు నోబుల్ విజేత అమర్త్యసేన్, ఆర్బీఐ మాజీ గవర్నర్లు రఘురామ రాజన్, దువ్వూరి సుబ్బారావు, వేణుగోపాల్రెడ్డి, కౌశిక్ బసు, రతిన్ దాస్, గోవిందరావు, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్లు, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్స్, మాజీ సివిల్ సర్వీసు అధికారులు తదితరులు దాదాపు 25 మంది వరకు భారత్ భవన్లో శిక్షణ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. మేధావులైన మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ కేంద్రమంత్రులను కూడా ఈ శిక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసి, వారి అనుభవాన్ని నలుగురికి విస్తరింపజేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
30-35 దేశాల నుంచి వివిధ రంగాల నిపుణులను భారత్ భవన్ కార్యక్రమాలకు జోడిస్తారు. “ఒకరకంగా చెప్పాలంటే రేపటి వెలుగు రేఖ ఈ భారత్ భవన్. ఇక్కడ శిక్షణ పొందిన వారు దేనిపైనైనా, ఎక్కడైనా మాట్లాడగలుగుతారు. సమస్యలకు లోతైన అవగాహనతో వినూత్న పరిష్కారాలు చూపించగలుగుతారు. ఇది ప్రజల కోసం అంకిత భావం, నైపుణ్యం గల అధికారులను, నాయకులను తయారు చేసే ఒక విజ్ఞాన కేంద్రం” అని పార్టీ నాయకుడొకరు వివరించారు.