కరీంనగర్ : జీవితమంతా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతిని పురస్కరించుకొని పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వద్ద భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు.
అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారి చూపిన ఉద్యమకారుడు, హక్కుల కార్యకర్త అన్నారు. దళిత పాఠశాలలు స్థాపించి బాల్య వివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారన్నారని ప్రశంసించారు. అహింస సమాజాన్ని స్థాపించి సంఘ సంస్కరణలకు, దళితుల అభ్యున్నతికి గట్టి పునాది వేశారన్నారు.
మద్యపాన నిషేధం, గ్రంథాలయాలు ఏర్పాటు వంటి కార్యక్రమాలలో తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి చేసిన కృషిని స్మరించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, కరీంనగర్ ఆర్డీఓ ఆనంద్ కుమార్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి నేతినీయల్, దళిత నాయకులు, తదితరులు పాల్గొన్నారు.