Bhagiratha Maharshi | కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ చొరవతో చారిత్రక పురుషుల, సంఘ సంస్కర్తల, మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప సంప్రదాయని, ఆయా వర్గాలకు ఆత్మగౌరవ సూచిక అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దిక్సూచిగా నిలువడం గర్వకారణమన్నారు.
నిజమైన ప్రజాస్వామ్య, ప్రజారంజక పరిపాలకుడిగా సీఎం కేసీఆర్ చెరగని స్థానాన్ని చరిత్రలో సుస్థిరం చేసుకున్నారన్నారు. ప్రజల జీవవ ప్రమాణాల మెరుగుదలకు శాశ్వత పరిష్కారందిశగా ప్రణాళికాబద్ధంగా బాటలు వేశారన్నారు. భగీరథ మహర్షి రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవం ఈ నెల 27న రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. ఈ సందర్భంగా తెలంగాణ సగర సంఘం ముద్రించిన వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్, ప్రతినిధులు సత్యం, కేపీ రాములు, రామ్, పల్లవి సుధీర్, రవి, వెంకట స్వామి పాల్గొన్నారు.