హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది భద్రాచలం వద్ద వరద పోటెత్తిందని ప్రత్యేక నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది. భద్రాచలం వద్ద వరద ప్రభావం, కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసేందుకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ ఈఎన్సీ నాగేందర్రావు నేతృత్వంలో ప్రత్యేక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆ కమిటీ మధ్యంతర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గోదావరిలోకి వచ్చి కలిసే 35కు పైగా వాగులు, వంకలు ప్రాజెక్టు నిర్మా ణం వల్ల గతంలో మాదిరిగా కలువలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది. అందువల్లే గతంలో కంటే తక్కువగా 22 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎక్కువ ముంపు ఏర్పడిందని స్పష్టం చేసింది. వరద నివారణకు ఎటపాక నుంచి భద్రాచలం వరకు రక్షణ గోడను విస్తరించాల్సి ఉంటుందని సూచించింది. అందుకు దాదాపు రూ.1650కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది.