Polavaram | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్లే భద్రాచలం పట్టణానికి వరద పోటెత్తి ముంపునకు గురైందని ప్రత్యేక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 35కు పైగా వాగులు, వంకలు గోదావరిలో కలవడం లేదని, 22 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ గతంలో కంటే ఎక్కువ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని పేర్కొన్నది.
ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్ఆర్ఎల్) వద్ద నీటిని నిల్వ చేసినప్పుడు భద్రాచలం వరకు బ్యాక్వాటర్ 43 అడుగుల మేర నిలిచి ఉంటాయని తెలిపింది. నిరుడు సంభవించిన భద్రాచలం వరదలపై అధ్యయనం చేసి, నివారణ చర్యలపై సిఫార్సులు చేసేందుకు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ నాగేందర్రావు నేతృత్వంలో ప్రత్యేక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలుత మధ్యంతర నివేదికను సమర్పించిన కమిటీ తాజాగా పూర్తిస్థాయి నివేదికను సర్కారుకు అందజేసింది. వరద నివారణకు చేపట్టాల్సిన చర్యలను సూచించింది.
గోదావరికి ఇరువైపులా కరకట్టల నిర్మాణం
భద్రాచలం ముంపు నివారణకు సుమారు రూ.1,629 కోట్లు అవసరం అవుతాయని నిపుణుల కమిటీ అంచనా వేసింది. గోదావరికి కుడివైపు బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వరకు, ఎడమ వైపు భద్రాచలం మండలం సుభాష్నగర్ కాలనీ నుంచి దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామం వరకు ఇరువైపులా దాదాపు 16 కి.మీ. పొడవునా రక్షణ గోడలు, కరకట్ట నిర్మాణం చేపట్టాల్సి ఉన్నదని నివేదికలో సూచించింది. ప్రస్తుతం ఉన్న కరకట్టలను మరింత పటిష్టం చేయాలని, 15 మైనర్, 2 మీడియం, 6 మేజర్ క్రాస్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని తెలిపింది.
‘పోలవరం’పై జాయింట్ సర్వే చేపట్టండి
ఏపీకి కేంద్ర జల్శక్తి శాఖ లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): పోలవరం ముంపు ప్రాంతాలపై సంయుక్త సర్వే చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర జల్శక్తిశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి కేంద్ర జల్శక్తిశాఖ మెంబర్ సెక్రటరీ రఘురామ్ బుధవారం ప్రత్యేకంగా లేఖ రాశారు. పోలవరం నిర్మాణంపై ఏకాభిప్రాయం సాధించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో జనవరి 25న ఢిల్లీలో కేంద్ర జలసంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో తెలంగాణ ప్రతిపాదించిన పలు అంశాలపై సీడబ్ల్యూసీ సానుకూలంగా స్పందించి బ్యాక్వాటర్ ఎఫెక్ట్, ముంపు తదితరాంశాలపై జాయింట్ సర్వేకు అంగీకరించింది. ఈ సర్వేకు తెలంగాణ సర్కారు సిద్ధంగా ఉన్నదని, వెంటనే ఆ దిశగా చర్యలను చేపట్టాలని ఏపీకి సూచించింది. తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని తాజా లేఖలో పేర్కొన్నది.