భద్రాచలం, ఆగస్టు 29: సంచలనంగా మా రిన భద్రాచలం ఎమ్మెల్యే పీఏ అవినీతి బాగో తం అనేక మలుపులు తిరుగుతున్నది. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ మోసం చేసిన వారిలో ఎక్కువ మంది నిత్యం క్యాంపు కార్యాలయానికి వచ్చే ఎమ్మెల్యే అనుచరులే ఉండటం గమనార్హం. వారినే లక్ష్యంగా చేసుకొని పీఏ తన అవినీతి దందాను నడిపినట్టు తెలుస్తున్నది. మణుగూరు బీటీపీఎస్ భూ నిర్వాసితుల స మాచారం అంతా సేకరించి వారికి ఫోన్లు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా వసూలు చేసినట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగిగా సబ్కలెక్టరేట్లో పనిచేసిన అనుభవం ఉన్న కల్యాణ్ ఎమ్మెల్యే కార్యాలయంలోనే మోసపూరిత ఆర్థిక లావాదేవీలు కొనసాగించినట్టు తెలుస్తున్నది.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన లోగోలు, సంతకాలు, డాక్యుమెంట్ ఫార్మాట్, వివిధ శాఖల ఉన్నతాధికారుల సంతకాలు చేసిన ఆర్డరు కాపీలు ఇలా అన్నీ ఫోర్జరీ చేస్తూ పత్రాలను రూపొందించడంలో ఆరితేరాడు. చర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం, వెంకటాపురంతోపాటు మండలాలకు చెందిన పలువురు ఎమ్మెల్యే అనుచరులతో సంబంధాలు ఏర్పరచుకొని ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదు తీసుకున్నట్టు తెలుస్తున్నది. భద్రాచలంకు చెందిన ఓ వైద్యుడు రూ.40 లక్షలు, ఉద్యోగోన్నతి కోసం జిల్లా ఆబ్కారీ శాఖకు చెందిన ఓ అధికారి రూ.10 లక్షలు సమర్పించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే బాధితులు 100 నుంచి 150 మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తున్నది.
నల్లగొండ, ములుగు, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు ఇసుక కాంట్రాక్టర్లు ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయానికి తరచూ ఇసుక ర్యాంపుల అనుమతి కోసం వచ్చేవారు. వారి తో పరిచయాలు పెంచుకొని ఇసుక ర్యాంపులు ఇచ్చేందుకు ఒప్పందాల పేరుతో సైతం మోసగించినట్టు తెలుస్తున్నది. చర్ల, వెంకటాపురం మండలాలకు చెందిన ఇసుక ర్యాంపుల లావాదేవీలు చూసే కొందరు యువజన కాంగ్రెస్ నాయకుల వద్ద సైతం డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. డబ్బులు ఇచ్చిన వారిలో కొందరికి పీఏ కల్యాణ్ నకిలీ నియామకపత్రాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. భద్రాచలంకు సమీపంలో ని ఓ కార్పొరేట్ సంస్థలో సైతం నకిలీ నియామకాలు ఇవ్వగా ఆ విషయం బయటకు పొక్కడంతో కొందరికి డబ్బులు చెల్లించినట్టు సమాచారం.
కల్యాణ్ కొన్నినెలలుగా కోట్లకు కోట్లు వసూ లు చేస్తుంటే ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా ఉంటుందని బాధితులు ఆరోపిస్తున్నారు. నిత్యం పక్కనే తిరిగే వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు తెలియకుండా ఎలా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే ప్రైవేటు పీఏగా పనిచేసిన వ్యక్తి కూడా ఇసుక ర్యాంపుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేయడం, ఆ విషయం బయటపడంతో ఎమ్మెల్యే స్పందిస్తూ తనకేమీ సంబంధం లేదని పేర్కొని అతన్ని తన కార్యాలయానికి రాకుండా చేశారు. ఇది జరిగి ఆరునెలలు గడువకముందే మళ్లీ ఈ ఘటన చోటుచేసుకోవడంపై ప్రజలు ఎమ్మెల్యే తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ కేంద్రంగానే రూ.కోట్లలో ఆర్థిక మోసం జరుగుతున్నా తెలియకుండా ఉంటుందా? అని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
భద్రాచలానికి చెందిన రాయల శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే పీఏ కల్యాణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కొడుకు ఉద్యోగం కోసం ఆటో, తన కూతురు బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9.95 లక్షల నగదు పలు దఫాలుగా కల్యాణ్ చెప్పిన ఖాతాలకు జమ చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబం వీధినపడిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు తనకు న్యాయం చేసి డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. కాగా పీఏ కొర్ల కల్యాణ్కుమార్ భద్రాద్రి జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. అతన్ని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కచ్చితమైన సమాచారం, డబ్బులను ఏం చేశారనే విషయంతోపాటు అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖాతాల విషయాలపై ఆరా తీస్తున్నట్టు తెలియవచ్చింది. అయితే పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.