హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ‘చిన్నపాటి పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు ఆర్జించండి. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి తరుణం మించిన రాదు’ అంటూ ఊదరగొట్టే యాప్స్ నానాటికీ పెరుగుతున్నాయి. ఇలాంటి యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు పోయి వాటిలో పెట్టుబడి పెడితే కేటుగాళ్ల చేతిలో మోసపోక తప్పదని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, ఈజెడ్ప్లాన్, సన్ఫ్యాక్టరీ.ఈటీసీ లాంటి యాప్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వీటిలో పెట్టుబడులు పెట్టి ఇప్పటికే పలువురు దారుణంగా మోసపోయారని తెలిపారు. ఊరు, పేరు లేని కేటుగాళ్లు ఇలాంటి యాప్లతో ప్రజలకు గాలం వేస్తున్నారని, తొలుత చిన్న మొత్తాల్లో లాభాలు ఇచ్చి మభ్యపెట్టినా.. అకస్మాత్తుగా ఓ రోజు దుకాణం సర్దేసి పెట్టుబడిదారుల సొమ్మంతా ఊడ్చేసుకుపోతున్నారని వివరించారు.