వరంగల్, డిసెంబర్ 11: కరోనా తర్వాత వచ్చిన బ్లాక్ ఫంగస్ వ్యాధికి చికిత్స అందించటం ఒక చరిత్ర అని సీనియర్ వైద్యులు అభివర్ణించారు. ఆ వ్యాధికి సరైన మందులు అందుబాటులో లేకున్నా, రోజూ వేలాది మందికి చికిత్స చేయటం శ్లాఘించదగ్గదని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. శనివారం వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఈఎన్టీ రాష్ట్ర సదస్సు జరిగింది. ఇందులో కరోనా తర్వాత వచ్చిన బ్లాక్ఫంగస్ వల్ల కలిగిన విపత్కర పరిస్థితులు, రోగులకు అందించిన చికిత్స, వైద్యులు ఎదుర్కొన్న సమస్యలు, ప్రభుత్వ సహకారంపై సీనియర్ డాక్టర్లు చర్చించారు. బ్లాక్ఫంగస్కు సరైన మందులు అందుబాటులో లేకున్నా, సందర్భానికి తగ్గట్టు చికిత్స అందించామని పలువురు తన అనుభవాలను పంచుకొన్నారు. కరోనా మొదటి దశ, రెండో దశల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొన్నదని చెప్పారు. గతం కంటే ఇప్పుడు వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు పెరిగాయని అన్నారు. కరోనా అనంతరం వచ్చిన వ్యాధులపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో వచ్చే పెను సవాళ్లను ఎదుర్కోనేలా పరిశోధనలు చేయాలని సూచించారు. సదస్సులో 250 మంది ఈఎన్టీ డాక్టర్లు పరిశోధన పత్రాలను సమర్పించారు. కాగా, సదస్సు ముగింపు రోజు ముంబై, తిరుచ్చి నగరాల్లోని ప్రముఖ దవాఖానల్లో జరిగే సర్జరీలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఇది డాక్టర్లు, వైద్య విద్యార్థులకు ఉపయోగపడుతుందని వైద్యులు పేర్కొన్నారు.