హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిలీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎస్సీసీ నేషనల్ మీట్లో తెలంగాణ క్యాడెట్లు సత్తా చాటారు. గురువారం ఎయిర్ కమాండోర్ పి మహేశ్వర్, డీడీజీ ఎన్సీసీ పలు విభాగాల్లో సత్తా చాటిన మన క్యాడెట్లను, క్యాంపునకు హాజరైన క్యాడెట్లను అభినందించారు. జాతీయస్థాయిలో నిర్వహించిన ఎసీసీ ఆర్డీసీ క్యాంప్లో సికింద్రాబాద్ కంటెంజెంట్కు చెందిన సార్జెంట్ జి ప్రేమ్ కృతిక బెస్ట్ క్యాడెట్గా ఎంపికైంది. జనవరి 28న నిర్వహించిన పీఎం ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి బెస్ట్ క్యాడెట్ ట్రోఫీని అందుకున్నది. నేవల్ బెస్ట్ క్యాడెట్ విభాగంలోనూ సికింద్రాబాద్కు చెందిన అమోఘవర్దరాజ్ మూడో స్థానంలో నిలిచాడు.
ఇక బెస్ట్ క్యాడెట్ జూనియర్ డివిజన్ ఆర్మీ విభాగంలో వి శివ గణేశ్, బెస్ట్ క్యాడెట్ జూనియర్ డివిజన్ నేవీలో సీహెచ్ నితిన్సాయి నాలుగో స్థానంలో నిలిచారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో 30 రోజుల పాటు క్యాంప్ను నిర్వహించారు. దీనికి 28 రాష్ట్రాల నుంచి 2,155 మంది ఎస్సీసీ క్యాడెట్లు, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఒక అధికారి, 121 మంది క్యాడెట్లు హాజరవగా.. వీరంతా సురక్షితంగా సికింద్రాబాద్ కంటెంజెంట్కు చేరుకున్నారు. ఈ మీట్లో 28 రాష్ట్రాలకు చెందిన క్యాడెట్లకు జాతీయస్థాయిలో వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన క్యాడెట్లు డీజీ ఎన్సీసీ మెడిలియన్ను అందుకున్నారు.