హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): పోడు సాగు, మెట్ట సాగుతో పొడిబారిన గిరిపుత్రుల జీవితాలకు ‘గిరి వికాసం’ పథకం తడినిస్తున్నది. గిరిజనుల భూములను అభివృద్ధిచేయటానికి రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన గిరివికాసం పథకం ద్వారా ఇప్పటివరకు రూ.44 కోట్ల వ్యయంతో 5,585 మందికి చెందిన 16,639 ఎకరాల భూమికి రెండు పంటలు పండేలా సాగునీటి సౌకర్యం కల్పించారు. వ్యవసాయ భూమి ఉండి నీటి సౌకర్యంలేని ఇద్దరుముగ్గురు గిరిజనులకు కలిపి ఈ పథకం కింద ప్రభుత్వం ఒక బోరుబావి వేయిస్తున్నది. దీనికి మోటర్, విద్యుత్తు కనెక్షన్ కూడా ప్రభుత్వమే ఉచితంగా సమకూరుస్తున్నది. ఈ పథకానికి గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్ నుంచి నిధులు కేటాయిస్తుండగా గ్రామీణాభివృద్ధి శాఖ అమలుచేస్తున్నది. ఒక రైతు భూమిలో వేసే బోరు నీటిని బృందంలోని ఇతర రైతులు కూడా వాడుకొనేలా ఒప్పంద పత్రాలపై సంతకాలు తీసుకుంటారు. నిధుల్లో 50 శాతం ఐటీడీఏ పరిధిలోని ప్రాంతాల్లో, 40 శాతం మైదాన ప్రాంతాల్లో, మిగిలినవి వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్న దగ్గర వినియోగిస్తారు. ఇప్పటివరకు గిరివికాసానికి రూ. 98.27 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.85 కోట్లు గిరిజన సంక్షేమశాఖ విడుదల చేసింది. రూ.44 కోట్లు ఖర్చుచేసి 5,585 గిరిజనులకు చెందిన 16,639 ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించారు.
గతంలో వర్షం పడితేనే పంటలు పండేవి. ఏడాదిక్రితం గిరివికాసం కింద నాకు, మా అన్న భూమికి కలిపి బోరు వేశారు. ఇప్పు డు రెండు పంటలు పండుతున్నాయి. నాకున్న రెండున్నర ఎకరాల్లో ఎకరన్నర వరి వేశా. మిగిలినదాంట్లో పత్తి, మిర్చి వేశా. ఒక్క ఏడాదిలోనే మా జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. మా పిల్లలు మంచిగా చదువుకోవడానికి డబ్బులు వస్తున్నాయి. రైతు బంధు కూడా వస్తున్నది.
–గౌరబోయిన స్వామి, గంగారం, తాడ్వాయి, ములుగు జిల్లా
గతంలో ఒకటే పంట పండేది. గిరివికాసం పథకంలో బోరు వేయటంతో పత్తికి మంచి గా నీళ్లు పెడుతున్నాం. ముగ్గురితో కలిపి బోరు వేసుకొన్నాం. బోర్లో 24 గంటలూ నీళ్లు వస్తూనే ఉంటాయి. రైతుబంధు కూడా వస్తున్నది. ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయి. గోధుమ, శనగ, జొన్న, కూరగాయలు పండిస్తున్నం.
–రాథోడ్ అమరేందర్, నార్నూర్, ఆదిలాబాద్ జిల్లా