Double Bedroom Scheme | నవాబ్పేట, జనవరి 8: డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులను ఎంపిక చేసినా ఇంకా ఎందుకు కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుండగా అధికారులు అడ్డుకోవడం తో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం గూడులేని పేదలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో నాటి జడ్చర్ల ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం యన్మన్గండ్ల గ్రామ సమీపంలో 48 ఇండ్లను నిర్మించింది. ఎనిమిది నెలల కిందట ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించారు. తర్వాత సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అక్కడ చిన్న చిన్న పనులు పూర్తికాకపోవడంతో అర్హులకు అప్పగించలేదు. ఇంతలోపే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఇండ్ల కేటాయింపు ప్రక్రియ నిలిచిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులైనా ఇండ్ల కేటాయింపుపై అతీగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. సోమవారం లబ్ధిదారులంతా కలిసి ఇండ్లలోకి ప్రవేశించేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ గోవర్ధన్తోపాటు రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి అక్కడికి వెళ్లి లబ్ధిదారులను అడ్డుకున్నారు. వెంటనే ఇండ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో అధికారులు, లబ్ధిదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించారు. చివరకు చేసేది లేక అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత ప్రభుత్వం తమకు ఇండ్లు కేటాయించినా ప్రస్తుత అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి అడ్డుతగులుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.