హైదరాబాద్ : బేగంబజార్ కులోన్మాద హత్య కేసులో ఆరుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నీరజ్ అనే యువకుడిని దారుణంగా శుక్రవారం రాత్రి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసులో అభినందన్, విజయ్, సంజయ్, రోహిత్, మహేశ్తో పాటు ఓ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించిన విషయాలను వెస్ట్జోన్ డీసీపీ జోవియల్ డేవిస్ వివరించారు. నీరజ్ భార్య సంజన పెద్దనాన్న కుమారులే హత్య చేసినట్లు తెలిపారు.
నీరజ్ హత్యకు 15 రోజులుగా కుట్ర పన్నారని పేర్కొన్నారు. నిందితులు జుమేరాత్ బజార్లో కత్తులు కొన్నారని చెప్పారు. నీరజ్ కదలికలను గత కొద్ది రోజులపాటు పరిశీలించారన్నారు. నీరజ్ – సంజన ప్రేమ పెళ్లి చేసుకొని షంషేర్గంజ్లో ఉంటున్నారని, వీరిద్దరి ప్రేమపెళ్లి ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని డీసీపీ తెలిపారు. సంజనతో సంబంధం లేదని కుటుంబ సభ్యులు వదిలేశారని, పెద్దనాన్న కుమారులు మాత్రం పరువుపోయిందని భావించారన్నారు. ప్రాణాపాయం ఉందని గతేడాది పెళ్లి చేసుకున్న సమయంలోనే నీరజ్ చెప్పాడని, అప్పుడు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు డీసీపీ వివరించారు.