రాష్ట్రంలో రూ.5కే పేదలకు కడుపునిండా, శుభ్రమైన ఆహారం
ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్రావు
హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పరిశుభ్రమైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు అనేక వ్యాధులను నివారించవచ్చని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఆహార పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ఏవైనా ఫిర్యాదులు ఉంటే 040-21111111 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం పేదలకు రూ.5కే పరిశుభ్రమైన పోషకాహారం అందిస్తున్నదని చెప్పారు. 2014లో ఈ పథకం ఎనిమిది అన్నపూర్ణ భోజన కేంద్రాలతో ప్రారంభమైందని, ఇప్పుడు 150 కేంద్రాలకు విస్తరించిందని తెలిపారు. రోజూ దాదాపు 30 వేల మందికి వేడివేడి పోషకాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. దవాఖానలకు వచ్చే రోగి సహాయకులకు సైతం రూ.5 భోజనం మూడు పూటలా అందుతున్నదని పేర్కొన్నారు. రోగులకు దవాఖానల్లో ఉచితంగా ఆహారం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.