హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ‘సర్'(ప్రత్యేక సమగ్ర సవరణ) విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సోమవారం ‘సర్’పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘సర్’లో భాగంగా వివిధ రాష్ర్టాల్లో ఏదో ఒక కారణంతో భారీస్థాయిలో ఓట్లను పక్కన పెట్టారని పేర్కొన్నారు. అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుందని, అదే జరిగితే రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 119 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం, ప్రతి బూత్లో బీఎల్వోలతో ముఖ్య నాయకులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ మాట్లాడుతూ.. సర్ విషయంలో దేశంలో జరిగిన పరిణామాలు గమనించాలని, బీజేపీ, ఎన్నికల కమిషన్ ఓట్ చోరీనే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు. ‘సర్’ కీలకమైన విషయమని, బీఎల్ఏ స్థాయి నుంచి అసెంబ్లీ ఇన్చార్జుల వరకు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ సూచించారు.