హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): కరోనా డెల్టా వేరియంట్ ఇంకా కనుమరుగు కాలేదని, మరోవైపు ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. దేశంలోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ రాష్ట్రంలో సైతం విస్తరించే ప్రమాదం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కచ్చితంగా మాస్కులు, పరిశుభ్రత, భౌతికదూరం పాటించాలని, కొవిడ్ టీకా రెండు డోసులు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా బయటపడలేదని చెప్పారు. 11 ‘రిస్క్’ దేశాల నుంచి వచ్చిన 979 మంది వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నారని అన్నారు. ఇందులో పాజిటివ్ వచ్చి టిమ్స్లో చికిత్స పొందుతున్న 13 మంది క్షేమంగా ఉన్నారని తెలిపారు. వీరి జీనోమ్ సీక్వెన్సింగ్ నివేదికలు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయని చెప్పారు. ఒమిక్రాన్తో మరణాల సంఖ్య పెరగటం లేదని, అయితే డెల్టాతో పోల్చితే ఐదారురెట్లు వేగంగా వ్యాపిస్తుండటంతో ఎక్కువమంది వ్యాధిబారిన పడుతున్నారని వివరించారు. ఒమిక్రాన్ గురించి రాబోయే రోజుల్లో మరింత అవగాహన వస్తుందని వెల్లడించారు.
ఫిబ్రవరిలో పతాక స్థాయికి..
వివిధ విశ్లేషణలు, నివేదికల ఆధారంగా మన దగ్గర జనవరి 15 తర్వాత కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని శ్రీనివాసరావు తెలిపారు. ఫిబ్రవరిలో పతాక స్థాయికి చేరొచ్చని అన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఫిబ్రవరి నాటికి హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. దీంతో డెల్టా వేరియంట్ ప్రబలకుండా, కొత్త వేరియంట్లను ఎదుర్కోవచ్చని వివరించారు. ప్రజలు రాబోయే 4-6 వారాలు కచ్చితంగా మాస్క్ ధరించాలని, వీలైతే ఇంట్లోనూ మాస్క్ పెట్టుకోవాలని కోరారు. 18 ఏండ్లకు పైబడిన వారిలో 90 శాతం మందికి మొదటి డోస్ వేశామని, ఇంకా 23,27,869 మంది ఒక్క డోస్ కూడా తీసుకోలేదని, వారికి ఈ నెలాఖరు వరకు వేస్తామని చెప్పారు.
సిద్ధంగా సర్కారు
ఒమిక్రాన్ నుంచి బయటపడేందుకు ప్రభుత్వం, వైద్యశాఖ సిద్ధంగా ఉన్నాయని డీపీహెచ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 60వేల బెడ్స్ను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో 27వేల పడకలు ఉండగా, 25వేలకుపైగా ఆక్సిజన్ పడకలేనని చెప్పారు. 1,256 కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నామని, 300 మెట్రిక్ టన్నులకుపైగా ఆక్సిజన్ను సొంతంగా ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఒమిక్రాన్తో తీవ్ర తలనొప్పి, తీవ్ర ఒళ్లునొప్పులు, నీరసం, నిస్సత్తువ ఉంటాయని, అనుమానం ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలను కాపాడే క్రమంలో 77 మంది హెల్త్ వర్కర్లు మరణించారని, కానీ కొన్ని మీడియా సంస్థలు కేసులు, మరణాల సంఖ్యపై అసత్య ప్రచారం చేస్తూ అవమాన పరుస్తున్నాయని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. దుష్ప్రచారాలు మాని ప్రజలకు ధైర్యం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, కొవిడ్ వ్యాప్తిని నిరోధించడానికి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పోలీస్, వైద్య, జీహెచ్ఎంసీ శాఖల అధికారులను లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు కొవిడ్ వ్యాప్తి నిరోధానికి తీసుకొన్న చర్యలను ఈ నెల 17 వరకు తెలియజేయాలని లోకాయుక్త జస్టిస్ సీవీ రాములు అధికారులను ఆదేశించారు.
కెయిమ్స్లో 43 మంది మెడికోలకు పాజిటివ్
కరీంనగర్లోని చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థ (కెయిమ్స్)లో 43 మంది మెడికోలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ జువేరియా తెలిపారు. ఈ కళాశాలలో కొన్నిరోజులుగా ‘చల్మెడ ఫెస్ట్’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలిచ్చారు. ఈ క్రమంలో కొందరు వైద్యవిద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం వీరికి పరీక్షలు నిర్వహించగా కేసులు బయటపడ్డాయి.
ఒక్క డోస్తో ఒరిగేదేం లేదు
కొవిడ్ టీకా ఒక డోస్ వేసు కోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెప్తున్నారు. అనేక అధ్యయనాలు సైతం ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న టీకాల సింగిల్డోస్ సామర్థ్యం సగటున 60 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఐసీఎంఆర్ ప్రకారం కొవిషీల్డ్ ఒక డోసు సామర్థ్యం 63 శాతంగా ఉన్నది. వెల్లూరులోని సీఎంసీ అధ్యయనం ప్రకారం సామర్థ్యం 61 శాతం. సింగిల్ డోస్ వేసుకున్నవారికి డెల్టా వేరియంట్ నుంచి 33 శాతం మాత్రమే రక్షణ లభిస్తున్నదని ఇంగ్లండ్ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఏ టీకా అయినా ఆరు నెలల తర్వాత యాంటిబాడీలు తగ్గిపోతున్నాయని, రెండు డోసులు వేసుకొంటే సగటున 80 శాతం వరకు సామర్థ్యం వస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
వైరస్ ముప్పు తొలగాలంటే ప్రజలు బాధ్యతగా ఉండటం ముఖ్యం. కొవిడ్ జాగ్రత్తలు, వ్యాక్సిన్ ద్వారా మా ప్రాణాలు, కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవారిని రక్షించుకుంటామన్న
అవగాహన ఉండాలి. ఫైన్ వేస్తేనే నిబంధనలు పాటిస్తామన్నట్టు వ్యవహరించటం దురదృష్టకరం.
కొత్తగా 156 కేసులు
రాష్ట్రంలో ఆదివారం 156 కొవిడ్ కేసులు వెలుగు చూసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరోవైపు 147 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా, ఇతర కారణాలతో ఒకరు మరణించారు. 3,787 మంది హోం ఐసొలేషన్/దవాఖానలో చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటు 98.85 శాతంగా ఉన్నది. ప్రతి పది లక్షల మందిలో ఇప్పటివరకు 7.72 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం ‘రిస్క్’ దేశాల నుంచి హైదరాబాద్కు 291 మంది రాగా, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో అందరికీ నెగెటివ్ వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 112 ప్రభుత్వ, 1,215 ప్రైవేట్ దవాఖానల్లో మొత్తం 55,442 పడకలు ఉండగా, ఇందులో 54,158 పడకలు ఖాళీగా ఉన్నట్టు పేర్కొన్నారు.